తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించి మళ్లీ అధికారాన్ని చేపట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అందుకు ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా ఎన్నికలకు వెళ్లేందుకు అడుగులు వేస్తున్నారు. ఈసారి గెలుపు అవకాశం ఉన్న వారిపై సర్వేలు చేయించి, గెలుపు గుర్రాల కు మాత్రమే టికెట్లు ఇవ్వాలని కెసిఆర్ నిర్ణయించారు.
ఈసారి ఎన్నికలలో కొత్త, యువ అభ్యర్థులను బరిలోకి దింపి ప్రయోగాలు చేయడం సీఎం కేసీఆర్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. ప్రజాక్షేత్రంలో మంచి పేరు, అనుభవం ఉన్న నాయకులకు పెద్దపీట వేసి టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ పార్టీలో చాలామంది నేతలకు మింగుడు పడడం లేదు.
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు ప్రజలు ఆదరించారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి చాలామంది కీలక నాయకులు తమ వారసులకు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈసారి వారికి టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు.
అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ను కోరగా, కెసిఆర్ ఈసారికి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రమే పోటీ చేయాలని తేల్చి చెప్పారని సమాచారం. ఈసారి వారసులకు టిక్కెట్లు ఇచ్చే ఆలోచన లేదని ఆయన స్పష్టంగా చెప్పడంతో తమ పిల్లలకు టికెట్ కావాలని ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు ఖంగు తిన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు ఈ సారి తమ వారసులకు టికెట్ ఇవ్వాలని అధినేత దృష్టికి తీసుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పలువురికి సీఎం కేసీఆర్ వారసులకు ఈ సారి ఎన్నికల్లో నో ఛాన్స్ అని తేల్చి చెప్పేసినట్టు సమాచారం. కెసిఆర్ నిర్ణయంతో ఈసారి ఎన్నికలలోనైనా తమ వారసులని రాజకీయాల్లోకి దింపాలని ప్రయత్నం చేస్తున్న పలువురు కీలక నేతలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది.