కరోనా కష్ట కాలం లో విద్యుత్ వినియోగ దారులకు పెద్ద కష్టం వచ్చిపడింది. వందలలో వచ్చే కరెంటు బిల్లు వేలల్లో రావడంతో లబోదిబోమంటున్నారు. కడప జిల్లా రాజంపేట పరిధిలో విద్యుత్ బిల్లులు ఊహించనంతగా రావడంతో మహిళలు లబోదిబోమని బుధవారం విద్యుత్ సబ్ స్టేషన్ లో అధికారులను కలిసి వినతి పత్రం అందించారు.
అక్కడ అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్పి, పరిశీలిస్తామని పంపారు. కరోనా మహమ్మారి తో లాక్ డౌన్ సందర్భంగా మార్చి నెలలో రీడింగ్ తియ్యలేదు. ఫిబ్రవరి నెలలో వచ్చిన బిల్లు రీడింగ్ మొత్తం ప్రకారం కట్టమని అధికారులు గతనెల ప్రకటించారు. చాలా మంది దాని ప్రకారమే కట్టారు.
అయితే ఏప్రిల్ నెలకు సంబంధించి ఈ నెల విద్యుత్ సిబ్బంది బిల్లులు తీశారు. బిల్లును చూసిన వినియోగదారులు ఖంగుతిన్నారు. ప్రతినెలా వందల్లో రావలసిన బిల్లు మూడింతలు రెట్టింపుగా వేలల్లో రావడంతో వారు ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా కష్ట కాలంలో ఆదాయం లేక, పూట గడవడమే కష్టంగా ఉన్న నేపధ్యంలో ఈ బిల్లుల బాదుడు ఏంటని వారు వాపోతున్నారు.
రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జి తో కలిసి రాజంపేట సబ్ స్టేషన్ లోని విద్యుత్ అధికారిని కలిసి వినతి పత్రాన్ని అందించారు. అధికారులు మీటర్లు రిపేర్ అని ఓ సారి, ఎండాకాలం అందులో కరోనా కాలం కాబట్టి అందరూ ఇంట్లో ఉండి అధికంగా విద్యుత్ వాడారని ఓసారి, ఇలా పొంతనలేని సమాధానాలు చెప్పి పరిశీలిస్తామని వినతి పత్రం అందుకున్నారు. బాధితులు తమకు న్యాయం చేయాలని కోరారు.