నర్సాపురం పార్లమెంటు సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె.రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా స్పందించే అవకాశం కనిపిస్తున్నది. కేంద్ర ఎన్నికల సంఘం క్లియరెన్సు ఇచ్చిన పేరు కాకుండా వేరే పేరుతో చెలామణి కావడం ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి వీలుకల్పిస్తున్నది.
నేడు పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు దాదాపు రెండు గంటల పాటు కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చలు జరిపారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అయినా కూడా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో చెలామణి అవుతున్నారని ఇదే పేరుతో తనకు కూడా షోకాజ్ నోటీసు ఇచ్చారని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి ఎంపీ రఘురామకృష్ణంరాజు తీసుకువెళ్లారు.
ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీ తనకు పంపిన షోకాజ్ నోటీసుల చెల్లుబాటు అంశంపై ఆయన ఎన్నికల సంఘం అధికారులతో చర్చించారు. పార్టీ లెటర్ హెడ్ పై కాకుండా మరో పేరుతో వున్న లెటర్ హెడ్ పై నోటీసులు వచ్చాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసుల లెటర్ హెడ్ పై వైసీపీ అని ఉందని, పార్టీ అసలు పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అయినందున తాను ఆ నోటీసులను ఏ విధంగా చూడాలి? అనే విషయంలో రఘురామకృష్ణంరాజు ఎన్నికల సంఘం నుంచి స్పష్టత కోరుతున్నారు.
ఆ నోటీసులు తనకు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పేరిట వచ్చాయని, ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటాడన్న సందేహాన్ని కూడా ఆయన అధికారుల ముందు వెలిబుచ్చినట్టు సమాచారం. పైగా, ఏ పార్టీలో అయినా క్రమశిక్షణ సంఘం అనేది ఉంటుందని, కానీ వైసీపీలో అలాంటి కమిటీ లేదని ఆయన అధికారులతో పేర్కొన్నట్టు తెలిసింది.
తప్పుడు పార్టీ పేరుతో నోటీసు ఇవ్వడమే కాకుండా నోటీసులో పేర్కొన్న అంశాలు ఏవీ కూడా ప్రజాప్రాతినిధ్య చట్టం లోని అంశాలకు సరిపోలడం లేదని ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. పత్రికలకు సమాచారం ఇవ్వడం అనేది క్రమశిక్షణ చర్య తీసుకునే నేరం కాదని న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదని కూడా మరి కొందరు అంటున్నారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసులోని డొల్లతనాన్ని తెలియచేస్తున్నాయని అంటున్నారు.