మూడు రోజుల క్రితం అంటే ఈ నెల 18న విజయనగరం గంట స్థంభం జంక్షన్ వద్ద సొమ్మసిల్లి, అపస్మారక స్థితిలో పడిపోయిన ఒక వృద్ధునికి అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు వై. సురేష్ కుమార్, ఆర్. సత్యన్నారాయణలు సపర్యలు చేసి, 108 అంబులెన్స్ కి సమాచారం అందించి, చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి, మానవత్వం చాటుకున్నారు.
సదరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లును జిల్లా ఎస్పీ ఎం. దీపిక జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలు, ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేసారు. వివరాల్లోకి వెళ్ళితే నగరంలో గంటస్థంబ జంక్షన్ వద్ద ఓ గుర్తు తెలియని వృద్ధుడు సొమ్మసిల్లి, అపస్మారక స్థితిలో పడిపోయి ఉండడంతో అక్కడ జనం గుమిగూడి ఉండడం అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు ఆర్. సత్యన్నారాయణ, వై. సురేష్ లు చూసి చలించిపోయారు.
సుమారు 60 ఏళ్ల వయస్సు కలిగిన ఒక వ్యక్తి కొద్ది రోజులుగా తిండి లేక, కళ్ళు కూడా తెరవలేని స్థితిలో అక్కడ పడి ఉండటం తెలుసుకున్నారు. దగ్గరలో ఉన్న మెడికల్ షాపు నుండి ఒఆర్ఎస్ డ్రింక్ ను తెచ్చి త్రాగించి, అతనికి సపర్యలు చేశారు. సదరు వృద్ధునికి కొంచెం తెలివి వచ్చి, తీవ్రమైన జ్వరంతో బాధ పడుతుండటంతో పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
వన్ టౌన్ కానిస్టేబుల్ సహాయంతో 108 అంబుల లెన్సును రప్పించి వైద్యం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు సపర్యలు చేసి సరైన సమయంలో ఆసుపత్రికి తరలించినట్లుగా సీనియర్ జర్నలిస్ట్ పూర్తి సమాచారం తెలుసుకుని వార్త రాసాడు.
దీంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, విషయం తెలుసుకున్నారు… జిల్లా ఎస్పీ ఎం. దీపిక. తక్షణం సదరు ఇద్దరు కానిస్టేబుల్ అయిన వై.సురేష్, రెడ్డి సత్యన్నారాయణలను తన కార్యాలయంకు పిలిపించి, అభినందించారు.
విధి నిర్వహణతోపాటు, సమయానుకూలంగా స్పందించి, ప్రాణపాయ స్థితిలో ఉన్న వృధ్ధునికి సపర్యలు చేసి, మానవత్వం చాటుకున్న విజయనగరం ట్రాఫిక్ కానిస్టేబుళ్ళను ఎస్పీ ఎం. దీపిక ప్రశంసా పత్రాను, ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేసారు. మానవత్వం చాటిన పోలీసు కాని స్టేబుళ్ళు సురేష్, సత్యనారాయణలను ట్రాఫిక్ డిఎస్పీ ఎల్. మోహనరావు కూడా అభినందించారు.