విజయనగరం జిల్లా లో కన్వర్జెన్స్ పనులు సత్వరమే ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ డా.ఎం. హరి జవహర్ లాల్ ఆదేశాలు జారీ చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 72 వినతులు అందాయి.
ముఖ్యంగా ఇళ్ళ స్థలాలు, పించన్ల, ఆరోగ్య శ్రీ , ఆదరణ, రైతు భరోసా లబ్ది కోసం దరఖాస్తులు అందాయి. జిల్లాలో స్పందన వినతులు పలు అధికారుల వద్ద 1200 వరకు పెండింగ్ ఉన్నాయని, వెంట వెంటనే పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
స్పందన కార్యక్రమంలో విబిన్న ప్రతిభా వంతులు, వయో వృద్ధులు సహాయ సంస్థ నుండి జిల్లాకు కేటాయించిన నాలుగు శ్రవణ యంత్రాలను బధిరులకు, వయో వృద్ధులకు జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్లాల్ , సంయుక్త కలెక్టర్ జే. వెంకటరావు , సహాయ సంచాలకులు నీలకంట ప్రధానో అందజేశారు. ఒక్కొక్కటి 3 వేల రూపాయల విలువైన ఈ యంత్రాలను లబ్దిదారులకు ఉచితంగా అందజేసారు.
దూర ప్రాంతాల నుండి స్పందన వినతులు ఇవ్వడానికి వచ్చే వారి కోసం, గర్భిణీలు, వికలాంగుల కోసం 10 రూపాయలకే రుచికరమైన భోజనం ఏర్పాటు చేసారు జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్. అయితే కోవిడ్ దృష్ట్యా ఇటీవల స్పందన భోజనం ఏర్పాటు చేయలేదు.
ప్రస్తుతం అధిక సంఖ్యలో వస్తున్న వారి కోసం స్పందన భోజనాన్ని ఈ సోమవారం నుండి తిరిగి ప్రారంబించారు. ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న కన్వర్జెన్స్ పనులను సత్వరమే ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. స్పందన అనంతరం కలెక్టర్ పలు పధకాల పురోగతి పై సమీక్షించారు.
రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ కేంద్రాలు, సచివాలయాల నిర్మాణాలకు ప్రారంభం కాని పనులు వెంటనే ప్రారంభం చెయ్యాలన్నారు. జగనన్న పచ్చ తోరణం సమీక్షిస్తూ తక్కువ సాధించిన వారి పై ఆగ్రహం వ్యక్తం చేసారు. లక్ష్యానికి 50 శాతం కన్నా తక్కువ ఉన్నవారు వచ్చే రెండు రోజుల్లో శత శాతం చేయాలన్నారు.
వై.ఎస్.ఆర్ బీమా, జగనన్న తోడు పధకాలలో పురోగతి కనపడాలన్నారు. జిల్లాలో 514 ఇ – సేవలు పెండింగ్ ఉన్నాయని, ముఖ్యంగా రెవిన్యూ శాఖ లో ఎక్కువగా ఉన్నాయని, ఈ రోజే ఆయా అధికారులతో మాట్లాడి క్లియర్ అయ్యేలా చూడాలని జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు కు సూచించారు.
జలసిరి దరఖాస్తు గ్రౌన్డింగ్ కార్యక్రమం వేగవంతం చేయాలనీ అన్నారు. ఇళ్ళ స్థలాల ప్రక్రియ పై ప్రత్యేకాధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. పలు కులాల కార్పొరేషన్లకు అవసరమగు కులాల రీ సర్వే వేగంగా జరిగేలా చూడాలని సాంఘిక సంక్షేమ డీ.డీ సునీల్ రాజ్ కుమార్ కు సూచించారు.
నీతీ అయోగ్ క్రింద చేపడుతున్న పధకాలను సమీక్షిస్తూ మళ్ళీ మొదటి స్థానం లో ఉండాలని, ఆయా శాఖలు ప్రగతి సాధన లో ముందుకు రావాలని అన్నారు. ఈ స్పందన కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరైనారు.