సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా కార్తీక మాసం ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ నెల 16 నుంచి డిసెంబరు 14వ తేదీ వరకు కార్తీకమాస రుద్రాభిషేకం, కార్తీక పురాణ ప్రవచనం, కార్తీక మాసవ్రతం, కార్తీక వన సమారాధన, కార్తీక మహాదీపోత్సవం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి తెలిపారు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆదివారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను అక్టోబరు 16 నుంచి 24వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించామని అదే విధంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తరహాలోనే 11 నుండి 19వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహిస్తామని తెలిపారు.
సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో జారీ చేస్తున్నామని ఆయన తెలిపారు. భక్తుల రద్దీని బట్టి వారపు రోజుల్లో 7 వేల టోకెన్లు, వారాంతంలో మరిన్ని అదనపు టోకెన్లు ఇస్తున్నామని ఆయన ప్రకటించారు. సర్వదర్శనం టైంస్లాట్ కౌంటర్ల వద్ద భక్తులు విధిగా మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్ వెంట తెచ్చుకోవడం లాంటి కోవిడ్-19 నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన అన్నారు.
ఆన్ లైన్ లో క్యాలెండర్లు, డైరీలు
2021వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను టిటిడి వెబ్సైట్తోపాటు అమేజాన్ ఆన్లైన్ సర్వీసెస్లోనూ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించామని ఆయన తెలిపారు.
ప్రపంచమానవాళికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణం, విరాటపర్వం పారాయణం, గీతాపారాయణం కార్యక్రమాలకు భక్తుల ప్రశంసలు అందుతున్నాయి.
వీటిని ఆదరిస్తున్న భక్తులకు కృతజ్ఞతలు. ఎస్వీబీసీ ప్రత్యక్షప్రసారం చేస్తున్న ఈ పారాయణ కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమాలను శాశ్వత ప్రాతిపదికన నిర్వహించేందుకు టిటిడి బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని ఆయన చెప్పారు.