ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరికో ఉచ్చు బిగుసుకుంటున్నది.
సీబీఐ అధికారుల దూకుడు చూస్తుంటే వారికి కీలక ఆధారాలు దొరికినట్లే అనిపిస్తున్నది. 66వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప, పులివెందుల ప్రాంతాల్లో అనుమానితులను విచారిస్తున్నారు. కడప కేంద్ర కారాగారానికి కర్ణాటక నుంచి 20 వాహనాల్లో బ్యాంకు అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చినట్టు సమాచారం. వారందరూ కూడా ఉదయమే అధికారులతో కలిసి బయటికి వెళ్లిపోయారు.
కడపకు చెందిన ముగ్గురు బ్యాంకు అధికారులు నేడు విచారణకు హాజరయ్యారు. కర్ణాటకలో ల్యాండ్ సెటిల్మెంట్కు సంబంధించి వివేకా, సునీల్ మధ్య వివాదం ఉన్న నేపథ్యంలో అక్కడి బ్యాంక్ అధికారులు, రెవెన్యూ సిబ్బందిని సీబీఐ అధికారులు పిలవడం చర్చనీయాంశమైంది.
సునీల్ యాదవ్ కస్టడీలో ఇచ్చిన సమాచారం మేరకు అన్ని ప్రాంతాల నుంచి సీబీఐ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి మధ్యాహ్నం సీబీఐ అధికారులను కలిసి వెళ్లారు. కేసు దర్యాప్తు గురించి అడిగి తెలుసుకున్నారు.
పులివెందులలో కూడా విచారణ సాగుతోంది. అనుమానితుల ఇళ్లల్లో సోదాలు జరుపుతున్నారు. అదే విధంగా పులివెందులలోని అనుమానితుల ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
సునీల్ యాదవ్, దస్తగిరి కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు చేసి వ్యవసాయ పనిముట్లు స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ అభిషేక్రెడ్డిని కూడా సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.