ఎపి పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎనిమిదేళ్ళుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుండా అన్యాయం చేస్తుంటే, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఏమి చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో కమ్యూనిస్టులకు పోటీ చేసే దమ్ముందా? అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన ఒక పత్రికా ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
అహంభావపూరిత, నిరర్థకమైన, వ్యక్తిగత పోకడలతో కూడిన ప్రకటనలతో ప్రయోజనం లేదన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజీనామా చేస్తే మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైందన్నారు. దేశాన్ని మతోన్మాదంతో విభజిస్తున్న, తిరోగమన ఆర్థిక విధానాలతో ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న బిజెపికి రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా చేయడమే కమ్యూనిస్టుల లక్షమని చాడ వెంకట రెడ్డి స్పష్టం చేశారు.
దేశ స్వాతంత్రోద్యమంలో, హైదరాబాద్ సంస్థానంలో నిజాం వ్యతిరేకోద్యమంలో పాత్ర లేని బిజెపి పార్టీ& స్వాతంత్రోద్యమంలో నాలుగు వేల ప్రాణాలు పణంగా పెట్టిన కమ్యూనిస్టు పార్టీలను సవాలు చేయడం సూర్యుని మీద ఉమ్మి వేయడం వంటిదేనని అన్నారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయకపోగా, తెలంగాణ నుండి ఏడు మండలాలను ఎపికి ఆఘమేఘాల మీద అప్పజెప్పిందని, రైతుల వడ్ల కొనుగోలును కూడా రాజకీయం చేసిందని మండిపడ్డారు. తెలంగాణకు బిజెపి ఏమి ఒరగబెట్టిందో చెప్పకుండా కమ్యూనిస్టులకు బండి సంజయ్ సవాలు చేయడం విడ్డూరంగా ఉన్నదన్నారు. వంటింటి గ్యాస్ ధరలను రెండింతలు చేసిన కేంద్రప్రభుత్వ తీరుపై బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా నిలదీస్తున్న ప్రజలకు ముందు ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.