విజయనగరం జిల్లా కేంద్రంలో కలెక్టర్ సూర్యకుమారీ రాష్ట్ర అవతర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ మేడపైన జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు.త్యాగధనుల భావజాలాన్ని భావితరాలకు అందజేయాలని హితవు పలికారు.ఈ వేడుకలలో జాయింట్ కలెక్టర్లు కిషో ర్ కుమార్, మహేష్ కుమార్, మయూర్ అశోక్, వెంకటరావు, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన వెంకటప్పలనాయుడు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొని జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు.
అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. త్యాగధనుల ఫలితంగానే రాష్ట్ర ఆవిర్భవించిందని.. వారి స్ఫూర్తిని, భావజాలాన్ని భావితరాలకు అందజేయాలన్నారు. ఏపీకి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని, మంచి పనితీరు, ఆదర్శ భావాలతో జీవిస్తూ ఆ గుర్తింపును కాపాడుకోవాలని పేర్కొన్నారు. మద్రాసీల నుంచి ప్రత్యేకంగా విడిపోక ముందో ఇక్కడి నేతలు, ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని, అవమానాలు ఎదుర్కొన్నారని కలెక్టర్ గుర్తు చేశారు.
ఎన్నో వ్యయ ప్రయాసలు పడి ఉమ్మడి రాష్ట్ర విడిపోయిన అనంతరం సాధించిన రాష్ట్రం అభివృద్ధిలో, సంక్షేమంలో ముందంజంలో ఉండాలని ఆకాంక్షించారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగ ఫలితంగానే ఈ రోజు మనందరం ప్రత్యేక రాష్ట్రంలో జీవిస్తున్నామని, ఆయన సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ ఈ సందర్బంగా పేర్కొన్నారు. గురజాడ చెప్పినట్లు ప్రతీ మనిషీ పౌరుల కోసం.. సమాజం కోసం జీవించాలని హితవు పలికారు. వైఎస్ స్సార్ జీవిత సాఫల్య పురస్కారానికి జిల్లా నుంచి అయిదుగురు ఎంపికవటం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఇటీవల చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆశాజనకంగా సాగిందని పేర్కొంటూ వైద్యాధికారులకు, సచివాలయ సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ విభాగ అధికారులు నిర్వహించిన జాబ్ మేళాలు సత్ఫలితాలను ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని డీఆర్వో గణపతిరావు ఆధ్వర్యంలో జరుగగా… ఎస్డీసీ పద్మావతి, విజిలెన్స్ డీఎస్పీ రఘువీర్ విష్ణు ఇతర జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.