కరోనా వ్యాప్తిని అరికట్టడం లో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫమైయిందని తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు దాట్ల కృష్ణవర్మ అన్నారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ధర్నా కార్యక్రమంలో భాగంగా ఆదివారం జగ్గంపేటలో బిజెపి జిల్లా అధ్యక్షులు దాట్ల కృష్ణవర్మ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ధర్నా నిర్వహించారు. పలకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ వర్మ మాట్లాడుతూ రోజురోజుకు ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కరోనా నివారణ కార్యక్రమాలు విఫలమయ్యాయని అభిప్రాయపడ్డారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికే పరిమితమై క్రింది స్థాయిలో ఏమి జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితి లో ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.
దేశంలోని కరోనా పాజిటివ్ రేటు తగ్గుతుంటే ఆంధ్ర ప్రదేశ్లో మాత్రం మరణాల రేటు, పాజిటివ్ రేటు కూడా పెరుగుతున్నాయి. దానికి కారణం మొదటినుంచి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చే కరోనా పాజిటివ్ కేసులను, మరణాలను ప్రభుత్వ గణాంకాల ప్రకారం తగ్గించి చూపడమే ప్రధాన కారణమని ఆయన అన్నారు.
ప్రైవేట్ ఆస్పత్రులలో కరోనా పేషెంట్ ల దగ్గర సొమ్ములు దారుణంగా యాజమాన్యాలు దోచేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. మీరు ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఆ వ్యవస్థ మంచిదే కానీ ఆ వ్యవస్థ ద్వారా ఇంటింటి సర్వే చేయించి ఏ ఇంట్లో కరోనా పేషెంట్ వున్నారో ఆ పేషెంట్ దగ్గరికి మందులు పంపించవచ్చు.
కానీ కరోనా రోగులు బయట తిరగడం వలన, సామాజిక దూరం పాటించకపోవడం వలన రాష్ట్రంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన్నారు.కరోనా మహమ్మారి రాష్ట్రంలో ఇంత ఎక్కువగా ఉంది అంటే దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం చేసే నివారణ కార్యక్రమాలు విఫలమయ్యాయని చెప్పుకోవాలి.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని కరోనా పట్ల బాధ్యతగా వ్యవహరించి తగు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర సహకారాన్ని అందించి పుచ్చుకోవడం లో ఇలా అన్నింటా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వ పని తీరును వ్యతిరేకిస్తూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో గండేపల్లి బిజెపి ప్రధాన కార్యదర్శి పోతుల శ్రీనివాస్, మండల సెక్రెటరీ తాతబ్బాయి తదితరులు పాల్గొన్నారు.