నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఖమ్మం టౌన్ ఏసీపీ పీవీ గణేష్ హెచ్చరించారు.
రైతులకు విక్రయించే విత్తనాలు, ఎరువులు నాణ్యత ప్రమాణాలను పాటించేలా ఖమ్మం నగరంలోని ఫెర్టిలైజర్ దుకాణ యజమానులు, డీలర్లతో ప్రత్యేక సమావేశం ప్రవేటు బడ్జెట్ హోటల్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ …నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని, రైతులకు విధిగా బిల్లులు ఇవ్వాలన్నారు. అధీకృత విత్తన, ఎరువుల డీలర్లు ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి నడుచుకోవాలని సూచించారు. ప్రభుత్వం సర్టిఫైడ్ చేసిన విత్తనాలను విక్రయించాలని సూచించారు.
నకిలీ విత్తనాల విక్రయాలు అరికట్టేందుకు పోలీసు, వ్యవసాయశాఖ అధికారులతో విస్తృతస్ధాయిలో తనిఖీలు నిర్వహిస్తునమని తెలిపారు.నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ను అమలు చేస్తామని తెలిపారు.రైతులకు మేలు కలిగించే రీతిలో నకిలీ విత్తనాలతో పాటు నకిలీ పురుగు మందుల విక్రయాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు వ్యవసాయ,పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ వుంటుందని అన్నారు.
ఇప్పటికే గడువు తీరిన, నాసిరకం విత్తనాల అమ్మకాలపై అధికారులు దృష్టి పెట్టిన అధికారులు మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో విత్తనాల స్టాక్ రిజిస్ట్రర్లు, ఎరువులు, పురుగుల మందుల స్టాక్ వివరాలతో పాటు ఆయా కంపెనీల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, విత్తనాలు , ఎరువులు ఎక్కడ నుండి దిగుమతి చేస్తున్నారనేది తెలుసుకుంటున్నారని అన్నారు.
రైతులు కూడా కొత్త వ్యక్తులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులను నమ్మి ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయరాదని, వ్యవసాయశాఖ ధ్రువీకరించిన వ్యాపారుల వద్దనే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభిస్తాయన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు.
రైతులు విత్తనాలు, ఎరువులు, మందులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు ఎవరైన విక్రయిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.