ఆకస్మికంగా సర్వజన హాస్పిటల్ తనిఖీ చేసిన విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి…!
ఓ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్… డాక్టర్ అయితే.. ఓ కలెక్టర్…డాక్టర్ అవ్వగలరా..! ఈ రాతలు ,మాటలు ఏమో గాని… ఏపీలో ని ఇటీవలే విజయనగరం జిల్లా కు వచ్చిన యంగ్ కలెక్టర్ నాగలక్ష్మి… డాక్టర్ అవతారం… అదే నండీ వైద్యుని గా కొంతసేపు కనిపించారు…అదీ సర్వజన హాస్పిటల్ తనిఖీ సందర్భంగా. మరి వివరాల్లోకి వెళదామా…!
ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేయాలని… విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. జిల్లా కేంద్రంలోని అంబటి సత్రం వద్ద ఉన్ళ ఘోషాసుపత్రి, అలాగే పోలీసు బ్యారెక్స్ వద్ద ఉన్న జిల్లా సర్వజన ఆసుపత్రులను కలెక్టర్ నాగలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆపరేషన్ థియేటర్ ప్రారంభం
ఘోషా ఆసుపత్రిని కలెక్టర్ నాగలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, పిల్లల వార్డులు, ఐపి రిజిష్ట్రేషన్, స్కానింగ్ సెంటర్, ల్యాబ్, ఈసిజి, ట్రయేజ్ రూమ్, ఐసియు, ప్రీ ఆపరేషన్ వార్డు, పోస్టు ఆపరేషన్ వార్డు, ఎస్ఎన్సి తదితర అన్ని విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పేషెంట్లతో మాట్లాడి, వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యులతో సమావేశమై, అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. వారి విజ్ఞప్తి మేరకు ఎసిలు, డెస్క్ట్యాప్లు, ప్రింటర్లు, స్కానర్లు, హిస్టోమేట్, సి-ట్యాప్, వెంటిలేటర్లు తదితర పరికరాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. వాటిని సక్రమంగా నిర్వహించాలని సూచించారు. జనరేటర్కు ఆటో స్విచ్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పారు. ఆధునీకరించిన ఆపరేషన్ థియేటర్ను ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి ప్రారంభించారు.
ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీ
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సర్వజన ఆసుపత్రిలో ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయాలని కలెక్టర్. నాగలక్ష్మి ఆదేశించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను ఆమె తనిఖీ చేశారు. ఆపరేషన్ థియేటర్లను, ఐసియు, ఓపి, వార్డులను, స్కానింగ్, ఎక్స్రే, ఈసిజి విభాగాలను, బ్లడ్ బ్యాంక్, ల్యాబరేటరీలను పరిశీలించారు. అనంతరం వివిధ విభాగాధిపతులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లతో సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలను, సమస్యలను తెలుసుకున్నారు. డాక్టర్ల విజ్ఞప్తి మేరకు కల్చర్ ల్యాబ్ మెటీరియల్, ఇతర విభాగాల నిపుణులు, ఐటిడిఏ నుంచి కో-ఆర్డినేటర్, థైరాయిడ్ టెస్టింగ్ కిట్స్, జనరేటర్, బయోమెట్రిక్ పరికరాలు, నెట్ సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్. నాగలక్ష్మి మాట్లాడుతూ, వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు. జిల్లా కేంద్రాసుపత్రి కొత్తగా భోధనాసుపత్రిగా రూపాంతరం చెందడం వల్ల, మొదట్లో కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయని, వాటనిని సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు. త్వరలో బోధనాసుపత్రి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, వాటికి సంసిద్దులు కావాలని కోరారు.
ఎక్కడైనా సిబ్బంది వృధాగా ఉన్నట్లయితే, వారిని ఇతర విభాగాలకు సర్దుబాటు చేయాలని సూచించారు. వైద్య రంగంలో ఏ రకమైన ఖాళీ ఉండకూడదన్నది ప్రభుత్వ విధానమని, దానికి అనుగుణంగా ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ తనిఖీల్లో వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మలీల, సూపరింటిండెంట్ డాక్టర్ అప్పలనాయుడు, వివిధ విభాగాల అధిపతులు, వైద్య నిపుణులు పాల్గొన్నారు.
ఎం. భారత్ కుమార్, సత్యం న్యూస్. నెట్, విజయనగరం