జిల్లా యువజన, క్రీడా శాఖల ఆధ్వర్యంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఇట్టి క్రీడా శిబిరాల్లో అథ్లెటిక్స్ తోపాటు ఇతర క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధితో పాటు క్రీడలకు సైతం పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించేలా కార్యాచరణ చేపట్టినట్లు అన్నారు.
క్రీడల్లో నైపుణ్యాభివృద్ది కి శిక్షణా శిబిరాలు ఎంతో దోహదం చేస్తాయని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 13, పట్టణ ప్రాంతాల్లో 25 క్రీడా శిబిరాల ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అన్నారు. శిబిరాల్లో ఇస్తున్న శిక్షణ తో క్రీడల్లో రాణించాలని తెలిపారు. శిక్షణా శిబిరాల్లో 14 సంవత్సరాల లోపు బాల బాలికలకు ప్రాధాన్యత నివ్వనున్నట్లు, యువత పాల్గొనవచ్చని, పాల్గొనగోరే వారు ఆయా ప్రాంతాల బాధ్యులను సంప్రదించాలని కలెక్టర్ అన్నారు.
ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో ఆధునిక హంగులతో బాస్కెట్ బాల్ స్టేడియం అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ అన్నారు. సర్దార్ పటేల్ స్టేడియంలో అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, టెన్నిస్, స్కెటింగ్, వాలీబాల్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, అర్చరీ, ఓపెన్ జిమ్, క్రికెట్ టర్ఫ్ వికెట్, కల్లూరు ఇండోర్ స్టేడియంలో అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, క్రికెట్ టర్ఫ్ వికెట్, వాలీబాల్, ఖోఖో, ఓపెన్ జిమ్, బ్యాడ్మింటన్, కబాడ్డి, టేబుల్ టెన్నిస్, చెస్, వైరా ఇండోర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ క్రీడల ఏర్పాట్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.
క్రీడలు మనిషి ఆరోగ్యంగా, మానసికంగా ఎదగడానికి దోహదపడుతాయని, క్రీడల వల్ల శారీరక దృఢత్వం కలుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటుచేస్తున్న క్రీడా శిబిరాలకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చి, విజయవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.