రైతులు పండించిన ధాన్యం చివరి గింజ కొనుగోలు చేస్తామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 230 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 197 కొనుగోలు కేంద్రాల ద్వారా 21,513 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అన్నారు.
కొనుగోలు చేసిన ధాన్యంలో 17,953 మెట్రిక్ టన్నుల ధాన్యం సంబంధిత మిల్లులకు తరలించినట్లు కలెక్టర్ తెలిపారు. రైస్ మిల్లులలోని బియ్యం భారత ఆహార సంస్థ గోడౌన్లలో అన్లోడ్ కు కొంత జాప్యం జరుగుచున్నందున, రైస్ మిల్లుల్లో స్థలాభావం వల్ల ధాన్యం సేకరణలో కొంత ఇబ్బంది కలుగుతున్నట్లు, ఇట్టి సమస్యను అధిగమించి, ధాన్య కొనుగోలు వేగవంతం చేస్తామని అన్నారు.
వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, వర్షానికి ధాన్యం తడవకుండా టార్పాలిన్ కప్పుకోవాలని, ధాన్యం తడిస్తే అరబెట్టుకోవాలని తెలిపారు. రైతులు కొంత ఓర్పు వహించి, సంయమనం పాటించాలని, అధికారులకు సహకరించాలని అన్నారు. కొనుగోలుకు కాస్త ఓపిక పెట్టాలని, ప్రతి రైతు పండించిన ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ అన్నారు.