లోక సంక్షేమం కోసం, కరోనా వ్యాధిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టిటిడి చేపట్టిన షోడశదిన సుందరకాండ దీక్ష అక్టోబరు 14న బుధవారం ముగియనుంది.
తిరుమలలోని వసంత మండపంలో సెప్టెంబరు 29న ఈ దీక్ష ప్రారంభమైంది.
“రాఘవో విజయం దద్యాన్మమ సీతా పతిఃప్రభుః ” అనే మహామంత్రం ప్రకారం సుందరకాండలోని మొత్తం 68 సర్గల్లో గల 2,821 శ్లోకాలను 16 మంది సుందరకాండ ఉపాసకులు 16 రోజుల పాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయణం చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి ఒక గంట పాటు ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
వసంత మండపంలో శ్లోక పారాయణంతోపాటు ధర్మగిరి వేద పాఠశాలలో మరో 16 మంది ఉపాసకులు 16 రోజుల పాటు జప, హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.