తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జూలై 7న మంగళవారం ఉదయం సుందరకాండ ప్రథమ సర్గ సంపూర్ణంగా 211 శ్లోకాల అఖండ పారాయణం నిర్వహించనున్నారు. తిరుమలలో సుందరకాండ పారాయణం ప్రారంభించి జూలై 7వ తేదీకి 27 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ప్రముఖ పండితులు, టిటిడి వేద పారాయణదారులు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలోని సంభావన వేద పారాయణదారులు, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, ధర్మగిరి వేద పాఠశాల, వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, విద్యార్థులతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
టిటిడి ముద్రించిన సుందరకాండలో 68 అధ్యాయాలు, 2,880 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో సోమవారం నాటికి ప్రథమ సర్గంలోని 211 శ్లోకాలు పూర్తవుతాయి. తిరుమలలో ఏప్రిల్ 10వ తేదీ నుండి ప్రారంభమైన “యోగవాశిస్టం – శ్రీ ధన్వంతరి మహామంత్రం” పారాయణం జూన్ 10వ తేదీ వరకు కొనసాగిన విషయం విదితమే.
అదేవిధంగా జూన్ 11వ తేదీ నుండి ప్రారంభమైన సుందరకాండ పారాయణాన్ని ఎస్వీబిసి ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈ శ్లోకపారాయణ యజ్ఞానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు నీరాజనం పలుకుతున్నారు. జూలై 7న శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ 12వ వార్షికోత్సవం జరుపుకోవడం విశేషం.