జస్టిస్ ఎన్వీ రమణ సారధ్యంలోని సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశ రాజకీయాలను కుదిపేస్తోన్న లఖీంపూర్ ఖేరిలో రైతులపై హత్యాకాండ కేసును సర్వోన్నత న్యాయం సుమోటోగా విచారణకు స్వీకరించింది.
ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరి జిల్లాలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తోన్న రైతులను కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా కారుతో ఢీకొట్టి చంపడం, ఈ మేరకు అతనిపై హత్య కేసు కూడా నమోదు కావడం తెలిసిందే.
సాక్ష్యాత్తూ కేంద్ర మంత్రి కొడుకే కారుతో రైతుల్ని చంపినట్లు ఆరోపణలు రావడం, అంతకు ముందు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా సైతం రైతుల్ని బెదిరించిన వీడియోలు వెలుగులోకి రావడం తెలిసిందే.
మంత్రిని పదవి నుంచి తొలగించి, ఆయన కొడుకును అరెస్టు చేయాలనే డిమాండ్ తో యూపీ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన విపక్ష నేతలను యూపీ పోలీసులు అడ్డుకోవడంపై దేశవ్యాప్తంగానూ నిరసనలు జరిగాయి.