సీనియర్ ఐపిఎస్ అధికారి ఏ బి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ను పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టిందని ఆరోపణలు చేసిన ఏ బి వెంకటేశ్వరరావు ఇటీవల ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్కు లేఖ కూడా రాశారు.
అక్రమ కేసులో తనను అరెస్టు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆయన ఆ లేఖలో సంచలన ఆరోపణలు చేశారు. తనను అరెస్టు చేసి ఆ తర్వాత తనను సర్వీసు నుంచి శాశ్వతంగా తీసేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని చేసిన ఆరోపణలు అప్పటిలో సంచలనం కలిగించాయి.
ఆ తర్వాత ఆయన రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. తనను అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్కు పంపి, మళ్ళీ సస్పెండ్ చేయాలని చూస్తున్నారు అంటూ కోర్టులో వేసిన కేసులో పేర్కొన్నారు.
దాంతో హైకోర్టు ఆయన్ను అరెస్ట్ చేయవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం, ఏబీ వెంకటేశ్వర రావు ఊహించినట్టే, ఆయన పై మళ్ళీ సస్పెన్షన్ వేటు వేసింది.