పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. గత ఎన్నికల్లో నందిగ్రామ్ లో మమతా బెనర్జీపై గెలిచిన బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి నేడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం మమతా బెనర్జీ ని ఓడించిన తర్వాత వీరిద్దరూ కలుసుకోలేదు. ఈరోజు ఊహించని రీతిలో వీరిద్దరూ కలవడం జరిగింది. శాసనసభలో విపక్షనేతగా ఉన్న సువేందు అధికారి సీఎం మమత గదికి వెళ్లారు.
అసెంబ్లీలో ఉన్న సీఎం ఛాంబర్ కు ఆయన వెళ్లడం ఆసక్తి కలిగించింది. ఈ సందర్భంగా ఆయనతో పాటు మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అనంతరం అసెంబ్లీ సెషన్ లో సువేందుని తన సోదరుడు అని సంబోధిస్తూ మమత మాట్లాడారు. సువేందుని తాను టీ కి ఆహ్వానించానని చెప్పారు. మరోవైపు, దీనిపై సువేందు మాట్లాడుతూ, ఇది మర్యాదపూర్వకంగా జరిగిన కలయిక అని అన్నారు. అయితే, తాను టీ తాగలేదని చెప్పారు.