నల్లగొండ జిల్లా నార్కట్పల్లి తహసీల్దార్ పొడపంగి రాధపై బదిలీ వేటు పడింది. ఆమెను పెద్దఅడిశర్లపల్లి మండలానికి బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆమె స్థానంలో పెద్దఅడిశర్లపల్లి తహసీల్దార్ దేవదాసును నియమించారు. రెండేళ్లుగా నార్కట్పల్లి తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న రాధ స్వేరో సంస్థ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అంతే కాకుండా ఈ నెల 4వ తేదీన ప్రవీణ్కుమార్ నార్కట్పల్లికి వచ్చిన సందర్భంగా భోజన ఏర్పాట్లు చేశారు. ఖమ్మంలో జరిగిన సమావేశం అనంతరం హైదరాబాద్ వెళుతూ మార్గమధ్యలో నార్కట్పల్లిలోని రివెరా హోటల్లో 400మంది కార్యకర్తలతో ప్రవీణ్కుమార్ సమావేశం కాగా, తహసీల్దార్ రాధ అక్కడే ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు సమాచారం.
దీంతో పాటు ఈ నెల 8వ తేదీన జరిగిన బీఎస్పీ బహిరంగ సభతో పాటు అంతకుముందు జరిగిన పలు సమావేశాల్లో ఆమె చురుగ్గా పాల్గొన్నందునే బదిలీ వేటు పడిందని చర్చ సాగుతోంది. బుధవారం కార్యాలయానికి వచ్చిన తహసీల్దార్ రాధ బదిలీ ఉత్తర్వులు వచ్చాయని తెలుసుకుని తక్షణం రిలీవ్ అయ్యారు.