నల్లగొండ జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న క్రమంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా కరెంటు ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలను ముట్టుకోకుండా చిన్నపిల్లలను దూరంగా ఉంచాలని డిఐజి ఏ.వి. రంగనాధ్ సూచించారు.
జిల్లాలోని వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్లు గాని, రహదారులు గాని, పొలాలకి వెళ్ళే బాటాలుగాని భారీ వర్షాల కారణంగా కొట్టుకోపోయే ప్రమాదం ఉన్నదని, జిల్లాలో ఎక్కడైనా రోడ్లు, వంతెనలు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడితే వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇస్తే స్థానిక అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు. చెరువులు, కుంటలు, వాగులు నీటితో నిండి ఉప్పొంగుతుంటా యని, వాగులు ప్రమాద స్థాయిలో పరుగులు పెడుతున్న సమయం లో ఎట్టి పరిస్థితుల్లో వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలకు సూచించారు.
గ్రామీణ ప్రాంతాలలో పాడుబడిన బావులు, చుట్టూ కంచె లేని బావుల దగ్గర జాగ్రతగా ఉండాలని, వర్షం నీటితో రోడ్లు పూర్తిగా తడిసి ఉండే పరిస్థితులలో వాహనాలు రోడ్ల పై తక్కువ వేగంతో వెళ్లాలని లేకపోతే ప్రమాదలకు గురి అయ్యే అవకాశం ఉంటుందని సూచించారు.
వాహనదారులు నెమ్మదిగా తమ గమ్యాలను చేరుకోవాలని, ప్రజల సంక్షేమంలో కూడా పోలీస్ అధికారులు ఎల్లపుడూ ముందుంటారని డిఐజి రంగనాధ్ తెలిపారు. ప్రజలంతా పోలీసులతో సహకరిస్తూ ఎలాంటి విపత్కర పరిస్థితులున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
పెద్ది నరేందర్, నకిరేకల్