చోరీ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. సత్తెనపల్లి పట్టణం, నాగన్నకుంట కాలనీలో తినుబండారాలు, ఫాన్సీ ఐటమ్స్ హోల్ సేల్ వ్యాపారి తూనుగుంట్ల లక్ష్మీ నరసింహారావు ఇంటిలో ఈ నెల 3వ తేదీ అర్ధ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఇంటిలోకి ప్రవేశించి బీరువాలోని సుమారు 32 సవర్ల బంగారు ఆభరణాలు (సుమారు 10 లక్షల విలువ) దొంగతనం చేశారు.
అందిన ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి పట్టణ సీఐ శోభన్ బాబు దర్యాప్తు నిర్వహించారు. సత్తెనపల్లి డిఎస్పీ R. విజయ భాస్కర రెడ్డి పర్యవేక్షణలో CI శోభన్ బాబు ఎసై రఘుపతి అందిన సమాచారం మేరకు వారి సిబ్బందితో కలిసి నేడు ఉదయం 7.30 గం.లకు, సత్తెనపల్లి పట్టణం నుండి నరసరావుపేటకు వెళ్ళే రోడ్డులోని కనకదుర్గమ్మ తల్లి గుడి దగ్గర అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసు పద్ధతిలో విచారించగా వారు ఈ నేరానికి పాల్పడినట్లు అంగీకరించారు. విచారణ అనంతరం నిందితుల వద్ద నుండి సుమారు 90 గ్రాములు బంగారు ఆభరణాలు, రూ.10,700/- లు నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి నరసరావుపేట పట్టణంలోని మణప్పురం ఫైనాన్స్ లో నిందితులు తాకట్టు పెట్టిన 170 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనపర్చుకోవాల్సి ఉన్నది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన మన్నేపల్లి పవన్ కుమార్, ముప్పాళ్ళ మండలం చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన అన్నపురెడ్డి మహేశ్వర రెడ్డి లను ఈ కేసులో అరెస్టు చేశారు. నిందితులు నరసరావుపేటకు సమీపంలో గల ఒక ఇంజినీరింగ్ కాలేజిలో చదువుతూ మధ్యలో చదువు ఆపివేసి, మందు త్రాగడము, కోతముక్క, పేకాట, ఆడడము, వ్యభిచార గృహాలకు వెళ్ళడము మొదలైన దుర్వసనాలకు లోనై దొంగతనాలు చేయడo మొదలు పెట్టారు.