మహిళా భద్రత కోసం మరిన్ని పటిష్ట చర్యలు చేపడుతూ మహిళా రక్షణ ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని డిఐజి ఏ.వి.రంగనాధ్ అన్నారు.
బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన షి టీమ్ పోలీస్ స్టేషన్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళ భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వారి రక్షణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మరింత సమర్ధవంతంగా పని చేస్తున్నదని చెప్పారు. మహిళలు ఫిర్యాదు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన క్యూ ఆర్ కోడ్ కరపత్రాలను ఆవిష్కరించారు. బాలికలు బహిరంగ ప్రదేశాల్లో, పనిచేసే చోట వేధింపులకు, భౌతిక దాడులకు గురికావడం, ఈవ్ టీజింగ్, బెదిరింపులకు గురి చేస్తే వెంటనే క్యూఆర్ కోడ్ స్కాన్చేసి ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు. షి టీమ్ పోలీస్ స్టేషన్ సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
టూ టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శించిన డిఐజి
అనంతరం ఆయన మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. 5 ఎస్ ఫైల్స్ నిర్వహణ విధానం పర్యవేక్షించి సిబ్బందితో మాట్లాడి వారిని అభినందించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో దీర్ఘకాలంగా ఉన్న వాహనాలకు సంబంధించి యజమానులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేయాలని, కోర్టు ద్వారా వాహనాల క్లియరెన్స్ కోసం అవసరమైన అన్ని రకాల నిబంధనలు విధిగా పాటిస్తూ సీజ్ చేయబడిన వాహనాలు, దీర్ఘకాలంగా పోలీస్ స్టేషన్లలో వదిలేయబడిన వాహనాల విషయంలోనూ వాటి యజమానులను గుర్తించి నోటీసులు జారీ చేయాలని సూచించారు.
ఆయన వెంట అదనపు ఎస్పీ నర్మద, మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర్ రావు, టూ టౌన్ సిఐ నిగిడాల సురేష్, రురల్ సిఐ సత్యనారాయణ, ఎస్.ఐ. సర్ధార్ నాయక్, షి టీమ్ అధికారిణి మాధురిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
పెద్ది నరేందర్, సత్యం న్యూస్, నకిరేకల్