పేద ప్రజల ఇంటి కలను నెరవేర్చాలా గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో నివాసాలు నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించకుండా సెంట్ భూమి కొండల్లో గుట్టల్లో ఇవ్వడమేమిటని కడప జిల్లా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరి ప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, కడప నియజకవర్గ ఇంచార్జ్ అమీర్ బాబు సంయుక్తంగా ప్రశ్నించారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పూర్తయిన టిడ్కో ఇళ్లను సోమవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా టిడ్కో నివాసాలను పేద ప్రజల కోసం గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల టిడ్కో ఇళ్లకు గాను 8 లక్షలు ఇళ్ళు పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం పంపిణీ చేయక పోవడంతో పాటు దుర్మార్గమన్నారు.
పేద ప్రజల కోసం జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వం 4,500 ఇళ్లను నిర్మించిందన్నారు. టిడ్కో ఇళ్లకు గత ప్రభుత్వం టెండర్లు పిలిపించి,లబ్ధిదారుల కాంట్రిబ్యూషన్ తో ఫస్ట్ పేజ్ పూర్తి చేసి 2,500 ఇళ్లను పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు అలాట్ చేయక పోవడం దుర్మార్గమన్నారు.
సెకండ్ స్టేజిలో 2000 ఇళ్లకు గాను కొన్ని ఫౌండేషన్,కొన్ని బిల్డింగ్ లు పూర్తి అయినా లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో అతి గతి లేదని మండిపడ్డారు. నిర్మించిన ఇళ్లను ఇస్తే ప్రయోజనం కానీ సెంటు భూమితో పేదలకు ఒరిగేదేమీ లేదన్నారు. జిల్లాలో టీడీపీ హయాంలో ఎన్టీఆర్ గృహాలు కట్టుకొని ఇళ్లలో చేరిన పేదలకు ఇవ్వాల్సిన 90 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పేదలు వడ్డీలకు అప్పులు తెచ్చుకొని ఇళ్లు కట్టుకుంటే వైసీపీ ప్రభుత్వం పెండింగ్ బిల్లులను విడుదల చేయక పోవడం దుర్మార్గమన్నారు. పేద ప్రజలకు తినడానికి తిండిలేక అప్పులకు వడ్డీ ఇవ్వలేక బిల్లులు విడుదల చేయాలని అధికారుల,నాయకుల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకపోవడం దారుణమన్నారు.
వైసీపీ ప్రభుత్వానికి పేదలపై ప్రేమ లేదన్నారు. పేదలకు టిడ్కో ఇళ్లను కేటాయించేంతవరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మత్స్య శాఖ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ యాటగిరి రామ్ ప్రసాద్ పాల్గొన్నారు.
ఇంకా, జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అమూరి బాలదాసు, మాజీశాప్ డైరెక్టర్ జయచంద్ర,ఉపాధి హామీ సభ్యులు, పిరయ్య,మాజీ జిపి గుఱ్ఱప్ప నేతలు జయకుమార్, నాసర్ అలీ, సుబ్బారెడ్డి, నబికోట శ్రీనివాసులు, కొమ్మలపాటి తదితరులు పాల్గొన్నారు.