కరోనా కేసులు రోజు రోజుకు ఉదృతంగా పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని కడప జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ఆదేశానుసారం శనివారం టీడీపీ మండల నాయకులు, కార్యవర్గ సభ్యులు కలసి రాజంపేట ఆర్డీవో ఆఫీసులో సిద్దవటం మండల డిప్యూటీ తసీల్దార్ అనురాధ వినతిపత్రాన్ని అందజేసారు.
కరోనా టెస్టు చేయించుకుంటే రిపోర్ట్ రావడానికి వారం రోజులు సమయం పడుతుందని ఆ సమయంలో వారి వల్ల ఎంతోమందికి వైరెస్ సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటింటికి తిరిగి కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్నారు కానీ అలాంటివి ఎక్కడా జరగలేదని అన్నారు.
ఒక్కొక్కరికి మూడు మాస్కులు ఇస్తానన్నారు కనీసం క్వారంటైన్లో ఉండే వారికి కూడా మూడు మాస్కులు ఇవ్వలేదని ఆరోపించారు. కొన్ని చోట్ల ఆక్సిజెన్ సమయానికి అందక కరోనా రోగులు చనిపోతున్నారని క్వారంటైన్ కేంద్రాలలో పరిశుభ్రత లేకపోవడం, నాసిరకమైన ఆహారంతో బాధితులు చాల ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాలను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా పరిస్థితి మారలేదని, ఇవన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏర్పడుతున్నవేనని ప్రజలు భావిస్తున్నారన్నారు.
జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకోసం తెలుగుదేశం పార్టీ ఈ పోరాటం చేస్తున్నదని అన్నారు. కరోనా మృతుల కుటుంబాలకి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని రాజంపేటలో టీడీపీ కార్యవర్గ సభ్యులు మన్నూరు రాజ,మందా శ్రీను,పీరు సాహెబ్,ఇడిమడకల కుమార్, సిద్ధవటం మండల పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి,దశరథ నాయుడు,నాగముని రెడ్డి,కుప్పాల వెంకటసుబ్బయ్య కోరారు.