అధికారం శాశ్వతం కాదని, ప్రతిపక్షాలను పలుచన చేస్తే సమయం సందర్భం వచ్చినపుడు అధికార పార్టీని పాతాళంలోకి తొక్కుతారని వనపర్తి పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు నందిమల్ల అశోక్ చెప్పారు. అనుచరుల ప్రవర్తన అధినాయకుల మీద ప్రభావం చూపుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. ఆవు చేనులో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయం గమనించమని చెబితే ప్రతిపక్షాలను శత్రువులను చేసి వెంటనే కేసులు పెట్టడం ప్రజాస్వామ్యమా అని ఆయన ప్రశ్నించారు.
ఈరోజు ఒక్కళ్లమే కావచ్చు, రేపు ప్రభంజనం వస్తుందని ఆయన అన్నారు. ఒక పార్టీని కించపరిచే ముందు మన మొదటి ప్రయత్నం గూర్చి మర్చిపోవద్దని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడిదే రాబోవు ఎన్నికలో విజయమన్నారు. కోట్లు సంపాదిస్తే మనం మన పిల్లలకు పరిమితం, ప్రేమ ఆప్యాయతలు ప్రజల సొంతం, ఆ నిస్వార్థ నాయకుడే వనపర్తి లెజండ్ అని ఆయన తెలిపారు. విలక్షణ రాజకీయాలకు వేదిక వనపర్తి అని ఆయన గుర్తు చేశారు. 2023 ఎన్నికలో వ్యక్తుల మధ్య పోటీ తప్ప పార్టీల మధ్య కాదని, ప్రజలు నిర్ణయం ఖరారు అయిందని చెప్పారు. ఉమ్మడి మహబూబునగర్ రాజకీయాలలో వనపర్తి ప్రజలు విలక్షణమైన తీర్పు ఇస్తారని, ఇది ఎన్నో సందర్భాల్లో నిరూపితమైందని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేసే వారిని ప్రజలు అనుక్షణం గమనిస్తారని తెలిపారు. ఆత్మాభిమానమే ప్రజల కొలబద్ద,ఆత్మాభిమానం దెబ్బతింటే ప్రజలు క్షమించరన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్