కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో అరికట్టడానికి, థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు జిల్లాలోని స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కలిసి రావాలని.. అధికార యంత్రాంగంతో సమన్వయంగా వ్యవహరించి సహాయ సహాకారాలు అందించాలని కలెక్టర్ ఎ. సూర్యకుమారి పిలుపునిచ్చారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో అందరూ విస్తృత సేవలందించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. జిల్లా యువజన అధికారి విక్రమాధిత్య ఆధ్వర్యంలో జిల్లాలోని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, సభ్యులతో జరిగిన జూమ్ కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన పద్ధతులు, అమలు చేయాల్సిన విధానాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. ముందుగా జిల్లాలో గుర్తించిన నోడల్ ఎన్.జి.ఓ.ల ప్రతినిధుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కార్యాలయాల్లో, మార్కెట్ లతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రాథమికంగా ముందుస్తు చర్యలు తీసుకోవటంలో మనమంతా కలిసి కట్టుగా పని చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు సహకారం అందించాలని స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులను కోరారు. బూస్టర్ డోస్ అందించే క్రమంలో కూడా సహాయ, సహకారాలు అందించాలని సూచించారు.
విశాఖకు సమీపంలో ఉండే మండలాల్లో పాజిటివ్ కేసులు పెరిగాయని, ఆయా ప్రాంతాల్లో కరోనాను అదుపు చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవటంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల సంచారంపై దృష్టి సారించి కరోనా వ్యాప్తి చెందుకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. వీధి నాటకాలు, ఇంటింటి ప్రచారం ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు భయాందోళనలు చెందకుండా ధైర్యం చెప్పాలని కోరారు. పారా మెడికల్ విభాగంలో సేవలందించేందుకు వాలంటీర్లను అందించాలని స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులను కోరారు.
మండల స్థాయిలో కరోనా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, సాధ్యమైనంత వరకు రోగులను క్షేత్రస్థాయిలోనే ఉంచి చికిత్స అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను శతశాతం పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి విజ్ఞప్తి మేరకు కలెక్టర్ బదులిచ్చారు. గత రెండు దశల్లో అంత్యక్రియల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఈ సారి అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. లక్షణాలు ఉన్న వారు మాత్రమే టెస్టులు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వీయ నియంత్రణే రక్షణ మార్గమని హితవు పలికారు.
ఏరియా, డిస్టిక్ట్ర్ ఆసుపత్రుల్లో కరోనా రోగులతో వచ్చే వారికి ఆహారం అందించటంలో స్వచ్ఛంద సేవా సంస్థలు సహకారం అందించాలని జేసీ మహేష్ కుమార్ కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె. వెంకటరావు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు డా.వేంకటేశ్ళరరావు ,కాపుగంటి ప్రకాశ్, రాజు, విశాల, రవి కుమార్, విశ్వనాథం, రాధిక, ఎస్.బి.సి.సి. కో-ఆర్డినేటర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.