శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ అరవింద్ బాబు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. అరవింద్ బాబు పై దాడి చేసిన CI మరియు SI లను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అరవింద్ బాబు లాంటి వెనుకబడిన వర్గాలకు చెందిన ఒక మంచి డాక్టర్ పై పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన ఖండించారు. జొన్నలగడ్డ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తీసుకువెళ్ళిన వారి సమాచారం పోలీసుల దగ్గర స్పష్టంగా ఉందని, వారిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అని ప్రశ్నించారు.
నరసరావుపేట శాసన సభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోల్పోయిన ప్రజాదరణను తిరిగి కాపాడుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. పార్టీ నాయకుడిని బూటు కాలితో తన్నే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని, డెమోక్రసీ లో నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉన్నదని ఆయన అన్నారు.
పోలీసుల సమక్షంలోనే డాక్టర్ అరవింద్ బాబు ను తీసుకెళ్తున్న అంబులెన్స్ పైనే వైసీపీ గుండాలు రాళ్లు వేస్తే వారిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదంటే పోలీసులు కూడా పాలకపక్షానికి తొత్తులుగా మారారని ఆయన అన్నారు.
అరవింద్ బాబు ను పరామర్శించి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన వారిలో ప్రత్తిపాటి పుల్లారావు తో బాటు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ నరసరావుపేట పరిశీలకులు మానుకొండ శివ ప్రసాద్, రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ షేక్ కరీముల్లా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.