టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి (69) కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న సబ్బం హరి విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. సబ్బం హరి స్వస్థలం తగరపువలస సమీపంలోని చిట్టివలస. సబ్బం హరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విశేష రాజకీయ అనుభవం ఉన్న సబ్బం హరి గతంలో విశాఖ మేయర్ గానూ పనిచేశారు. 2009లో కాంగ్రెస్ తరఫున అనకాపల్లి నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
అప్పట్లో వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఓ దశలో ఓదార్పు యాత్రలో జగన్ వెంటే నడిచారు. కానీ తర్వాత జరిగిన పరిణామాలు ఆయనను రాజకీయాలకు దూరం చేశాయి. ఆపై టీడీపీలో చేరారు. కొన్నివారాల కిందట కరోనా బారినపడిన ఆయన మొదట ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. కానీ లక్షణాలు తీవ్రం కావడంతో వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరారు. కానీ చికిత్స పొందుతుండగా, ఇటీవల పరిస్థితి విషమించింది. అప్పటినుంచి ఆరోగ్యం మరింత క్షీణించింది.
సబ్బంహరి ప్రస్థానం
1౼06౼1952 న విశాఖ తగరపువలస చిట్టివలసలో సబ్బం హరి జన్మించారు. తండ్రి బంగారునాయుడు, తల్లి అచ్చియ్యమ్మకు ఆయన ఆరవ సంతానం. సొంతూరు లోనే పాఠశాల చదువు పూర్తిచేసి ఇంటర్ ఏవీఎన కళాశాలలో చేరారు. అక్కడే డిగ్రీ పూర్తిచేశారు. ఇక రాజకీయాల విషయానికొస్తే 1995లో విశాఖ మేయర్ గా ఎన్నికయ్యారు. అనంతరం 2009 లో 15వ లోక్ సభకు విశాఖ జిల్లా లోని అనకాపల్లి నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. గత సాధారణ ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మంత్రి అవంతి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం టీడీపీ సీనియర్ పార్టీ నేతగా బాద్యతలు నిర్వహిస్తున్నారు..
రెండు వారాలు గా కోవిడ్ తో బాధ పడుతూ 03౼05౼2021 లో మధ్యాహ్నం 1.57 నిమిషాలకు కరోనా తో చికిత్స పొందుతూ అపోలో హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు.