38.2 C
Hyderabad
April 29, 2024 22: 21 PM
Slider నెల్లూరు

వేడెక్కుతున్న నెల్లూరు జిల్లా రాజకీయాలు

#magunta

నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి టిడిపి నేతలతో భేటీ కావడం ఇక్కడ సంచలనంగా మారింది. మాగుంట శ్రీనివాసులరెడ్డి సోదరుడు సుధాకర్ రెడ్డి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు నివాళి అర్పించేందుకు మాగుంట నివాసానికి టీడీపీ నేతలు వెళ్లారని చెబుతున్నా కూడా ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత కనిపిస్తున్నది. ఆ మధ్య టీడీపీ అగ్ర నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా పరామర్శకు వచ్చారు.

తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్ కుమార్.. అందరూ కలసి మాగుంట నివాసానికి వెళ్లి పరామర్శించి వచ్చారు. ఇటీవల మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీ అధిష్టానం తీరుతో కాస్త అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఆ మధ్య ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట ఇల్లు, ఆఫీస్‌లపై కూడా సోదాలు జరిగాయి.

ఈ క్రమంలో వైసీపీ నుంచి ఎవరూ సానుకూలంగా మాట్లాడలేదు. అటు మాగుంట కూడా వచ్చేసారి ఎన్నికల్లో తన తరపున తన కొడుకు పోటీ చేస్తారని ప్రకటించారు. దానిపై కూడా వైసీపీ నుంచి స్పందన లేదు. మాగుంట కుటుంబానికి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మంచి పలుకుబడి ఉంది. నెల్లూరు, ఒంగోలు నుంచి కూడా వారు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు నుంచి ఎంపీగా ఉన్నారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డితో మాగుంటకు మరీ అంత సఖ్యత లేదనే ప్రచారం కూడా ఉంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ నేతలు మూకుమ్మడిగా కలసి మాగుంట ఇంటికి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. మాగుంట శ్రీనివాసులరెడ్డి అందర్నీ సాదరంగా ఆహ్వానించారు. ప్రస్తుతానికి ఇది పరామర్శ మాత్రమేనంటున్నారు రెండు పార్టీలకు చెందిన నేతలు. అంతకు మించి ప్రత్యేకంగా ఇతర అంశాలేవీ వారి మధ్య చర్చకు రాలేదని చెబుతున్నారు. నెల్లూరు రాజకీయాలను అంచనా వేయడం కష్టం.

నెల్లూరులో స్వపక్షంలోనే విపక్షంలా చాలామంది కొట్లాడుకుంటున్నారు. జిల్లాలోని అన్ని స్థానాల్లో వైసీపీ గెలిచినా కూడా చాలా చోట్ల వైసీపీ ఎమ్మెల్యేల మధ్యే సఖ్యత లేదన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు మాగుంట శ్రీనివాసులరెడ్డితో టీడీపీ నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై ఎవరూ పెద్దగా స్పందించకపోయినా, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయోననే ఆసక్తి మాత్రం ప్రజల్లో ఉంది.

Related posts

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Satyam NEWS

అండర్-15 ఏసియా సాఫ్ట్ బాల్ పోటీల్లో సత్తా నిరూపించాలి

Bhavani

శతాధిక యోగికి శతకోటి వందనాలు

Satyam NEWS

Leave a Comment