వరద నీటితో, యూజీడి మురుగుతో కడప నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వరద నీటి ప్రవాహం అడ్డంకులు తొలగించి,తక్షణ సహాయక చర్యలు చేపట్టి నగరవాసులను కాపాడాలని కడప అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జ్ వి.ఎస్.అమీర్ బాబు డిమాండ్ చేశారు. సోమవారం కడప, బిల్టోప్, అహమాదీయ నగర్ పరిధిలోని మసీదు వీధిలో టీడీపీ నేతలు, స్థానికులతో కలసి జలమైన ప్రాంతాలలో పర్యటించారు. వినూత్నంగా వరి నాట్లు వేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వి.ఎస్.అమీర్ బాబు మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చిన్నపాటి వర్షానికే నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధిక మొత్తంలో ఆస్తి పన్ను, చెత్త పన్నులు వేసి ప్రజల నుండి బలవంతంగా పన్నులు వాసులుచేసే పాలక వర్గానికి నగరం నిండా మునిగి సామాన్య ప్రజానీకం జీవనం అస్తవ్యస్తమైంది కనపడలేదా…? అని ప్రశ్నించారు. నగరంలో ఏ సందులో చూసిన పెద్దపెద్ద గోతులతో నీళ్లు నిండి స్విమ్మింగ్ పూల్లను తలపిస్తుందని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతంలో చీకటి పడితే వీధి దీపాలు వెలగవు. వర్షాల కారణంగా దోమలు, విష కీటకాలతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు.
మైనారిటీ మంత్రి, డిప్యూటీ సిఎం, కడప ఎమ్మెల్యే నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారా…? ముఖ్యమంత్రి గారికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారా…? స్థానికులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చెవిటి వాని ముందు శంఖం ఊడినట్లే పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నగర పాలక సంస్థ పాలకవర్గం, అధికారుల ధనదాహానికి సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురైతున్నారు. నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న అక్రమ లే అవుట్ లను తొలగించి వర్షపునీరు దిగువ ప్రాంతాలకు వెళ్ళేట్లు చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ మసీదు వీధిలో పక్క రోడ్డు నిర్మించి, వర్షపు నీరు బయటకు పోయే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్థానికులతో నగర పాలక సంస్థ ముందు ఉద్యమాలు చేసేందుకైనా వెనుకాడమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు శివకొండా రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శివరాం, జిల్లా అధికార ప్రతినిధి బాలదాసు, జిల్లా బిసి సెల్ కార్యదర్శి కోదండ రామ్, రవిశంకర్ రెడ్డి, వరప్రసాద్, నాసర్ అలీ, విశ్వనాథ్, స్థానికులు మహమూద్ అలీఖాన్, అహ్మదీయా మజ్జీద్ మోలానా షర్ఫుద్దీన్, ఖాజా మొయినుద్దీన్, అహ్మద్ ఖాదర్ భాషా , మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.