హీరోల అభిమానులంటే చిత్రపటలకు పాలాభిషేకం చేయటం… సినిమా రిలీజైతే బ్యానర్లు కట్టుకుని హంగామా చేయడం తరచు చూస్తుంటాం…కానీ చెన్నిపాడు జూ. ఎన్టీఆర్ అభిమానులు చాలా భిన్నం.. ఆయన పుట్టిన రోజునాడు పేదల కడుపు నింపే ప్రయత్నం చేయండి కానీ తన చిత్రపటానికి పాలభిషేకాలు వద్దన్న మాటకు కట్టుబడి పేద కుటుంబాల కడుపు నింపే ప్రయత్నం చేశారు.
గద్వాల జిల్లా మానోపాడు మండల పరిధిలోని చెన్నిపాడు గ్రామంలోని జూ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులంతా కలిసి బుధవారం గ్రామంలోని వితంతు మరియు వృద్ధ కుటుంబాలకు లాక్ డౌన్ లో కనీస సాయం చేసేందుకు పూనుకున్నారు.
యువకులంతా చేయి చేయి కలిపి సుమారు 200 కిలోల కూరగాయలు తెప్పించారు. రెండ్రోజులకు సరిపడ కూరగాయలను ప్యాక్ చేసి వృద్దులకు, వితంతు కుటుంబాలకు పంపిణీ చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మనోపాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి నాగేంద్రం గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మండలంలో గతంలో కూడా విధులు నిర్వర్తించాను. నాయకులు, ప్రజాప్రతినిధులు దానధర్మాలు చేయడం చూసాను.. కానీ ఒక హీరోకు చెందిన అభిమానులు ఇలా తల్లిదండ్రులకు తెలియకుండా చందాలు వేసుకుని వితంతు, వృద్ధ కుటుంబాలకు ఆసరానివ్వడం అనేది చూడలేదని అన్నారు. వీరిని అందరి హీరోల అభిమానుల ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. యూవతను అభినందించారు.
అనంతరం ఆయన చేతుల మీదుగా వితంతువులకు, వృద్దులకు కూరగాయలు అందజేశారు. అందరూ లాక్ డౌన్ నియమాలను పాటించాలని కోరారు. అతిక్రమిస్తే వేయి రూపాయల జరిమానా పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జూ ఎన్టీఆర్ అభిమానులు, గ్రామ సర్పంచ్ వెంకటమ్మ, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు, పంచాయితీ సెక్రటరీ కుర్మయ్య, మాజీ సర్పంచ్ మద్దిలేటి, లాయర్ వెంకట్రాముడు, ఎంపీటీసీ స్వాములు వృద్ధులు, వితంతువులు తదితరులున్నారు.