రైతులకు మేలు చేయని నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు గుంటూరు జిల్లా నరసరావుపేటలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు, రైతులు, సిపిఎం, సిపిఐ, సిఐటియుసి, టీడీపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రైతు దినోత్సవం గురించి మాట్లాడే అర్హత సిఎం జగన్ సర్కార్కు లేదని ఈ సందర్భంగా వారు అన్నారు. రాష్ట్రంలో ఉంది రైతు దగా ప్రభుత్వమని వారన్నారు. ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని వారన్నారు. టీడీపీ ప్రభుత్వం హెక్టారుకు అందించిన రూ.20 వేల ఇన్పుట్ సబ్సిడీని రూ.16 వేలకు తగ్గించారు..ఇది రివర్స్ పాలన కాదా..? అని డాక్టర్ చదలవాడ ప్రశ్నించారు.
పోలవరం ఎత్తు తగ్గించి ప్రాజెక్టు అర్థం, పరమార్థం మార్చివేశారని ఆయన అన్నారు. రైతు ఆత్మహత్యలలో రాష్ట్రాన్ని దేశంలో మూడో స్థానంలో నిలిపిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ సంస్థలు మేలు కోసమేనని ఆయన అన్నారు.