పెండింగ్ ఉపాధిహామీ బిల్లులు చెల్లించాలంటూ చంద్రబాబు అధ్యక్షతన టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలియజేశారు. పెండింగ్ లో ఉన్నరూ.2500కోట్లు తక్షణమే చెల్లించాలంటూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించారు.
ప్రజలను జగన్ మభ్యపెడుతున్నారు
ఈ సందర్భంగా శాసనసభ పక్ష ఉపనేత నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రాభివృద్ధికి గ్రహణం పట్టిందని విమర్శించారు. సంక్షేమం పేరుతో ప్రజలను జగన్ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. నరేగా నిధుల్నిసద్వినియోగం చేసుకుని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీ చేపట్టిందని గుర్తు చేశారు. ప్రభుత్వం మారిన వెంటనే నరేగా బిల్లులు నిలుపుదల చేయటం దుర్మార్గమన్నారు. గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగట్లేదని, ఒక్క రోడ్డయినా వేశారా అని నిమ్మకాయల ప్రశ్నించారు.
కక్షసాధింపు చర్యల్లో భాగంగానే బిల్లుల నిలుపుదల
రూ.2500కోట్లతో గ్రామాల్లో 2018-19లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఎన్నికలు రావటంతో ఆ బిల్లులు నిలిపేశారని ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే బిల్లులను నిలిచివేశారని దుయ్యబట్టారు. రూ. 1860కోట్లు ఏడాది క్రితమే కేంద్రం మంజూరు చేసినా జగన్ ప్రభుత్వం వాటిని వేరే పనులకు మళ్లించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అప్పులు చేసి పనులు చేసిన మాజీ స్థానిక ప్రజా ప్రతినిధులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం పదవికి జగన్ అనర్హులు
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి లేకుండా పోయిందని, రూ.1800కోట్లు నిధులు కేంద్రం నుంచి వచ్చినా స్వప్రయోజనాల కోసం వాడుకున్నారని దీంతో ఇసుక లేక భవన నిర్మాణ రంగం కుదేలైందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. 70 వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బకాయిలు పడిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్కరు కూడా టెండర్లు వేసే పరిస్థితి లేదని పనులు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పూర్తిగా కుదేలైందన్నారు. జగన్ పాలనలో గుడ్డి, చెవిటి, మూగ ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. అసెంబ్లీలో ఇవన్నీ ప్రశ్నిస్తే అధికార బలాన్ని ప్రయోగించి తమ నోర్లు మూయించే ప్రయత్నంలో భాగంగానే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో కాకుంటే మండలిలో మీ అధికార దుర్వినియోగాన్నినిలదీస్తామని గోరంట్ల హెచ్చరించారు. కరోనా విషయంలో కూడా ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. చేతలు కాలాక అకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వ పనితీరు ఉందని విమర్శించారు. ఇప్పటికే ఏడు వేల మంది కరోనాతో మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. క్వారంటైన్ నుంచి ఇంటికివెళ్లే వారికి రెండు వేలు అని ప్రకటించి ఇప్పటి వరకూ వారికి ఆ మొత్తం అందించలేదని ఆరోపించారు. నేటికీ సిఎం, మంత్రులు కనీసం మాస్క్ లు కూడా పెట్టుకున్న పాపాన పోలేదన్నారు. మొత్తానికి జగన్ పాలనలో అన్ని రంగాలను నాశనం చేశారని దుమ్మెత్తిపోశారు. సీఎం పదవికి జగన్మోహన్రెడ్డి అనర్హులన్నారు.