ఈఎస్ఐ కుంభకోణంలో నిందితుడు ప్రమోద్రెడ్డి విజయవాడలోని ఏసీబీ కోర్టులో గురువారం మధ్యాహ్నం లొంగిపోయాడు. న్యాయమూర్తి పి.రాంబాబు ఆయనకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు.
రాష్ట్రంలో ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందులు, వైద్య పరికరాల కొనుగోలు విషయంలో భారీ కుంభకోణం జరిగిందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్శాఖ నిగ్గు తేల్చింది. దీనిపై ఏసీబీ అధికారులు రెండు కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతోపాటు ఈఎస్ఐ డైరెక్టర్లుగా పని చేసిన డాక్టర్ బి.రవికుమార్, డాక్టర్ సీకే రమేష్, డాక్టర్ జి.విజయ్కుమార్, మరికొంత మందిని జూన్ 12న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరికొంత మంది నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. తర్వాత క్రైమ్ నంబర్ 4తో మరో కేసును నమోదు చేశారు. ఇందులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడి తోపాటు ఈఎస్ఐ ఉద్యోగి ప్రమోద్రెడ్డి పేర్లను చేర్చారు. మందుల కోనుగోలు మొత్తం రూ.150కోట్ల వరకు గోల్మాల్ జరిగిందని ఏసీబీ నిగ్గు తేల్చింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న ప్రమోద్రెడ్డి తాజాగా న్యాయస్థానంలో లొంగిపోయాడు.