46 నెలలుగా జీతాలు లేక బాధపడుతున్న డీఎస్సీ-2002 బాధిత హిందీ భాషా పండితులు తొలి జీతం అందుకునే వరకూ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, శ్రీకాకుళం జిల్లా శాఖ విశ్రమించబోదని జిల్లా సహాధ్యక్షుడు కుప్పన్నగారి శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళం ఎన్జీవో హోమ్ లో జరిగిన బాధిత భాషాపండితుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. బాధిత భాషాపండితుల జీతాల కోసం పిసిని వసంతరావు, కూన రంగనాయకులు నేతృత్వంలోని శ్రీకాకుళం జిల్లా శాఖ తీవ్రంగా శ్రమించిందని, ఎట్టకేలకు సమస్య తీరేలా జీవో విడుదలైందని చెప్పారు. బాధితులకు ఖాజానాశాఖ ఐడిల కోసం జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ ఖాజానాశాఖాధికారి వారికి ప్రాతినిధ్యం చేసారని, ఈ దశలో మండల విద్యా శాఖాధికారులు, ఉప ఖజానా శాఖాధికారులు తాత్సారం చేయడం సరికాదని అన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ప్రాతినిధ్యం చేయనున్నట్లు బాధిత పండితుల ప్రతినిధి సిహెచ్.రమణమూర్తి, ఉరిటీ శ్రీనివాసరావులు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జి.మేరీ ప్రసాద్, కింతలి రవిశంకర్, చింతపల్లి జనార్దనరావు, ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
previous post