టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించే క్యూ న్యూస్ బాధ్యుడు తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బుల కోసం తీన్మార్ మల్లన్న తనను బెదిరిస్తున్నాడని ఓ వ్యక్తి చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణ అనంతరం తీన్మార్ మల్లన్నను అరెస్టు చేశారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని మధురానగర్లో మారుతీ జ్యోతిష్యాలయం అనే సంస్థను లక్ష్మీకాంత్ శర్మ నిర్వహిస్తున్నారు. ఈ జ్యోతిష్యాలయంపై ఇటీవల క్యూ న్యూస్లోవరుస కథనాలు ప్రసారం చేశారని, ఆ తర్వాత డబ్బుల కోసం బెదిరింపులకు దిగాడని లక్ష్మీకాంత్ శర్మ ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మల్లన్న కార్యాలయంపై పోలీసులు దాడి చేసి హార్డ్ డిస్క్ లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ప్రశ్నించే నెపంతో పిలిచి ఇప్పుడు అరెస్టు చేశారు.
ఇది ప్రభుత్వ కక్ష సాధింపేనని, దీన్ని తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించింది. తీన్మార్ మల్లన్నను చట్టబద్ధంగా హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని సీనియర్ పాత్రికేయుడు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అనంచిన్ని వెంకటేశ్వరరావు అభిప్రాయ పడుతున్నారు.
అంతా రహస్యంగా.. పక్కగా ఓ ప్రణాళిక ప్రకారం.. నిశ్శబ్దంగా అరెస్టు జరిగిందని ఆయన అన్నారు. చాడీ చప్పుడు లేకుండా.. సాధారణ విచారణ పేరుతో నమ్మకంగా పిలిచి చర్లపల్లికి గోప్యంగా తరలించారని ఆయన ఆరోపించారు. ఈ విషయం ఉన్నతాధికారులకు ముందే తెలిసి చర్లపల్లి జైలులో సింగిల్ బ్యారెక్ కూడా సిద్దం చేసినట్లు తెలిసిందని ఆయన అన్నారు.
ఈ లక్ష్మీ ‘కాంత’ శర్మకు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఏ గుర్తింపు ఉన్న యూనివర్సిటీ కానీ ఎలాంటి అధికారిక అవార్డులు, డాక్టరేట్లు ఇవ్వలేదని, ప్రచారంలో ఉన్నవన్నీ అబద్దాలేనని ఆనంచిన్ని అన్నారు. అలాంటి వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జర్నలిస్టును ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. లక్ష్మీ కాంత శర్మ పేద, మధ్య తరగతి ప్రజలను అతను మోసం చేసినట్లు క్యు న్యూస్ తీన్మార్ మల్లన్నకు పదుల సంఖ్యలో బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారని, వాటికి సంబంధించిన ఆడియోలు కూడా సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేశాయని అలాంటి వాడిని వదిలేసి జర్నలిస్టును అరెస్టు చేయడమేమిటని ఆనంచిన్ని ప్రశ్నించారు.