పౌరసత్వ సవరణ బిల్లు 2019 ను పార్లమెంటు ఉభయ సభలలో విజయవంతంగా ఆమోదించడాన్ని తెలంగాణ బీజేపీ హృదయపూర్వకంగా స్వాగతిస్తుందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె. కృష్ణసాగర్ రావ్ అన్నారు. ఈ చట్టాన్ని అమలు చేయడానికి మెజారిటీ సభ్యులు పార్లమెంటులో ఓటు వేశారని ఆయన అన్నారు.
CAB 2019 చట్టంగా మారడానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు , కేంద్ర హోంమంత్రి అమిత్ షా కృషిని తెలంగాణ బీజేపీ అభినందిస్తోందని, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇందులో భాగస్వామి కావడం అభినందనీయమని ఆయన అన్నారు. ఇది చట్టం గా మారడానికి ప్రధాని నరేంద్రమోడీ కృషి ఎనలేనిదని, నూతన భారత దేశం కోసం ప్రధాని పెడుతున్న దృష్టి అభినందనీయమని ఆయన అన్నారు.
పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డిఎయేతర పార్టీలందరికీ బిజెపి కృతజ్ఞతలు తెలుపుతోందని కృష్ణసాగర్ రావ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని టిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు ఎందుకు ఈ బిల్లును అడ్డుకోవడానికి, నిలిపివేయడానికి ప్రయత్నించారో తెలంగాణ ప్రజలకు వివరించాలని అన్నారు. వారు హిందూ వ్యతిరేక వైఖరిని ఎందుకు తీసుకున్నారని కృష్ణసాగర్ రావ్ ప్రశ్నించారు.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ , బంగ్లాదేశ్ లలో మత హింస ను ఎదుర్కొంటున్న హిందువుల దుస్థితి పట్ల ఏ మాత్రం సానుభూతి లేకపోగా బీజేపీ ప్రభుత్వం చేసే మంచికి అడ్డు తగిలిన టీఆరెస్ , కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ ప్రజలు తిరస్కరించాలని ఆయన అన్నారు.