మారిషస్ దేశ తెలుగు మహాసభ సంఘం, తెలుగు కల్చరల్ ట్రస్ట్, తెలుగు స్పీకింగ్ యూనియన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్ , క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ శాఖ మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్ తో నేడు సమావేశమయ్యారు. మారిషస్ తెలుగు మహాసభ ఏర్పడి గత ఆగష్టు – 2022 లో 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రూపొందించిన లోగో ను ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని (జూన్ 2 వ తేదీన) పురస్కరించుకుని మారిషస్ తెలుగు భాష సంఘం, మారిషస్ తెలుగు మహాసభ, మారిషస్ కల్చరల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో వచ్చే జూన్ – 2023 లో వేడుకలు నిర్వహిస్తున్నట్లు వారు మంత్రికి తెలిపారు. మారిషస్ లో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవిర్భవ దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొనాలని రాష్ట్ర మంత్రిని ఆహ్వానించారు.
అలాగే, మారిషస్ లో స్థిరపడిన తెలుగు ముఖ్యంగా తెలంగాణ ప్రజల కోసం (తెలంగాణా రాష్ట్రం ) సాంస్కృతిక, పర్యాటక, విద్యా అవకాశాల పై పరస్పర సహకారం అందించాలని, అందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని మంత్రి డా . V. శ్రీనివాస్ గౌడ్ కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తో మారిషస్ లోని స్థిరపడిన తెలంగాణ ప్రజలు పరస్పర ఒప్పందానికి (MoU) అవకాశం కల్పించాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మారిషస్ నుండి వచ్చిన ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో కల్చరల్ ప్రతినిధి విశ్వకర్మ ఆధ్వర్యంలో మారిషస్ నుండి బాలరాజ్ పెంటయ్య, వైస్ చైర్మన్ , సెక్రటరీ శ్రీ ధరంరాజ్ నారాయణసామి, హెవీన్ గురయ్య, ఉపాధ్యక్షులు, మారిషస్ తెలుగు మహాసభ, రాజేంద్ర అప్పాలస్వామి, చైర్మన్, తెలుగు విద్యాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.