తెలంగాణ నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నదని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం ముధెళ్ళి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న 30 డబుల్ బెడ్ రూం ఇళ్ళకు స్థానిక శాసనసభ్యులు జాజుల సురేందర్ తో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ధనికులు అయినా పేదలకు అయినా ఆత్మగౌరవం ఒక్కటే. పేదల ఆత్మగౌరవం కాపాడటానికే డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం. గత ప్రభుత్వాల హయాంలో ఇళ్ళ నిర్మాణం కోసం ఏదో నామ్ కే వాస్తేగా డెబ్బై వేల రూపాయలు ఇచ్చారు. కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం పేదలు అన్ని వసతులతో ఇళ్లు కట్టుకోవడానికి ఒక్కో ఇంటికి అయిదు లక్షల రూపాయలతో మంజూరు చేస్తున్నార అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని ఆయన తెలిపారు. రైతుబంధు, రైతుభీమా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ అన్ని వర్గాలకు అందుతున్నాయని, 42 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ల కోసం ఏటా రూ. 12000 కోట్లు ఖర్చు చేస్తున్నారని స్పీకర్ తెలిపారు. దేశంలో వ్యవసాయ రంగం కోసం 24 గంటలు ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు.