ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, సోదర సమానుడు అయిన తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో సభ్యుడైన వేముల ప్రశాంత్ రెడ్డి మరో మారు ఏపి రోడ్లను ఎద్దేవా చేశారు. గతంలో సీఎం కేసీఆర్ కుమారుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఏపిలో రోడ్ల పరిస్థితిని అవహేళన చేసిన విషయం తెలిసిందే.
సంక్రాంతికి ఊరు వెళ్లిన తన స్నేహితుడు ఒకరు తనను కలిసి తెలంగాణ ప్రజలను పక్క రాష్ట్రానికి తీసుకువెళ్లి తీసుకువస్తే చాలు తెలంగాణ రాష్ట్రంలో ఎంత సుఖంగా బతుకుతున్నారో అర్ధం అవుతుందని అన్నారని కేటీఆర్ తెలిపారు. అక్కడి రోడ్లను ఒక్క సారి చూపిస్తే తెలంగాణ లో పరిస్థితి ఎంత మెరుగ్గా ఉందో అర్ధం అవుతుందని అప్పటిలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనిపై ఏపి మంత్రులు భగ్గుమన్నారు.
సాక్ష్యాత్తూ ఏపీ సీఎం కూడా కేటీఆర్ తో మాట్లాడి సర్ది చెప్పడంతో కేటీఆర్ తన వ్యాఖ్యలను సరిచేసుకున్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా రోడ్ల పరిస్థితి ఏపిలో మెరుగుపడలేదు. ఈ విషయాన్ని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరొక్క మారు వెల్లడించారు.
బస్ లో తల్లాడ నుంచి తిరువూరు పోతే… బోర్డర్ దాటగానే బస్ లో పడుకున్నాయన లేస్తాడు.. ఎందుకంటే బస్ అక్కడ ఎక్కువ ఊగుతది.. రోడ్లు అట్లుంటయి.. అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా తల్లాడ సభ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ కామెంట్లు చేశారు. తెలంగాణ లో తమ ప్రభుత్వం ద్వారా 8 ఏళ్లలో 20 వేల కోట్లు ఖర్చు చేసినం.. రోడ్ల, బ్రిడ్జి ల కోసం…అని ఆయన అన్నారు.
రాయచూరు బీజేపీ ఎమ్మెల్యే అడిగిండు.. తెలంగాణ లో ఇచ్చిన పథకాలు అక్కడ అమలు చేయాలని… దేశంలో బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతు బంధు ఉందా… ఫ్రీ పవర్ ఉందా.. లేదు.. ఎందుకంటే అక్కడ కెసిఆర్ లేడు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత … జిఎస్ డిపి రెండున్నర రెట్లు పెరిగింది..దద్దమ్మలు.. వాళ్ళకి చేతకాదు.. అయినా మాట్లాడతారు..అని వ్యాఖ్యానించారు.