కరోనా రోగులకు ఆక్సిజన్ దొరకడం లేదు….. ఎంతో మంది ఆక్సిజన్ అందక చనిపోతున్నా ప్రభుత్వం మాత్రం సరిపడేంత ఆక్సిజన్ ఉందనే చెబుతుంటుంది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఆక్సిజన్ అందక రోగులు చనిపోతుంటే ఆ నిజాన్ని ఒప్పుకోకుండా కేవలం ఆక్సిజన్ ప్లాంట్ లో కొద్ది పాటి మరమ్మతుల వల్ల ఇలా జరిగిందని తప్పును సరిదిద్దుకోకుండా కప్పిపుచ్చే యత్నం చేస్తున్నారు.
మరి ప్రభుత్వ వైఖరే ఇలా ఉంటే ఇక ప్రయివేటు ఆసుపత్రులు ఎలా ఉంటాయి? అంతకన్నా దారుణంగా ఉంటాయి. అదీ కూడా అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడికి సంబంధం ఉన్న ఆసుపత్రి అయితే….. ఇక అడ్డేముంది?
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఓ ప్రైవేట్ హాస్పిటల్ వద్ద జరిగిన ఈ సంఘటన రాష్ట్రం మొత్తం పరిస్థితికి అద్దం పడుతుంది.
డబ్బులు కట్టినా ఆక్సిజన్ లేకపోతే ఎలా అని ప్రశ్నించిన మహిళ పై వైసిపి సిటి కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ దారుణంగా ప్రవర్తించారు.
‘‘నోరు ముయ్యి నీ డబ్బులు నీకు పడేస్తాం’’ అంటూ దారుణంగా ఆమెను హెచ్చరించారు. పో చెప్పుకో పో… ప్రభుత్వానికి చెప్పుకుంటావో టీవీ 9 కు చెప్పుకుంటావో చెప్పుకో అంటూ అతి కర్కశంగా ప్రవర్తించారు.
రూపాయికి పది రూపాయిలు పడేస్తానని ఆయన అన్నారు. ప్రవేట్ ఆస్పత్రుల్లో డబ్బులు లేకుండా ఎవడు వైద్యం చేయడని ఆకుల సత్యనారాయణ నమ్మలేని నిజాన్ని చెప్పారు.
సంఘటన జరిగిన ఆదిత్య హాస్పిటల్ నుంచి బాధితుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లంటూ ఉచిత సలహా ఇచ్చారు.
ఆక్సిజన్ అందడం లేదని అడిగినందుకు ఆదిత్య ఆస్పత్రి యాజమాన్యానికి మద్దత్తుగా బాధిత కుటుంబ సభ్యులపై మండిపడ్డారు. ఆ మహిళ కన్నీటి పర్యంతం అయింది.