తెలంగాణ పథకాలు దేశమంతా విస్తరిస్తా మని సీఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఖమ్మం లో జరిగిన బిఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలు జరుగుతుంటాయి. గెలుపు ఓటములు సహజం. కానీ భారత దేశం , భారత సమాజం లక్ష్యం ఏంటి.. భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా.. దారి తప్పిందా.. బిత్తరపోయి గత్తర పడుతుందా.. ఏం జరుగుతా ఉంది ఈ దేశంలో.. ఈ విషయం మీద నా అంతరాత్మ అనేక రకాలుగా కలిచి వేస్తా ఉంది. అందరూ సీరియస్గా ఆలోచించాలి” అని పిలుపునిచ్చారు.
దేశంలో ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి, ఏ ప్రపంచ బ్యాంకు తీసుకునే అవసరం లేనటువంటి .. ఏ అమెరికా కాళ్లు మొక్కాల్సిన అవసరం లేనటువంటి.. ఏ విదేశీయుల సహాయం అవసరం లేనటువంటి.. సహజ సంపద ఈ దేశ ప్రజల సొత్తు అన్నారు. దేశంలో లక్షల కోట్ల కోట్ల ఆస్తి ఉందని, ఇదంతా ఏమైతుంది అని ప్రశ్నించారు. దేశంలో సంపద లేకుంటే బిక్షం ఎత్తుకుంటే తప్పులేదు. కానీ ఉండి మనం ఎందుకు యాచకులం కావాలని ప్రశ్నించారు. అమెరికా మనకంటే రెండున్నర రెట్లు పెద్దగుంటది.. కానీ అక్కడున్న వ్యవసాయ భూమి 22 శాతమే.
చైనా మనకంటే ఒకటిన్నర రెట్లు పెద్దగుంటది వాళ్లకున్న వ్యవసాయ భూమి 16 శాతం. భారత దేశం భూభాగం 83 కోట్ల ఎకరాలు.. ఇందులో సరాసరి సగం 41 కోట్ల ఎకరాలు అంటే సగం భూమి వ్యవసాయానికి అనుకూలం. అపారమైన జల సంపద లక్షా 40 వేల టీఎంసీల వర్షం కురుస్తుంది. 70 వేల టీఎంసీలు ఆవిరైతే.. మనం ఉపయోగించుకునే నీరు 70-75వేల టీఎంసీల నీరు. భూమి ఉంది.. నీరు ఉంది.. పంటలు పండటానికి అవసరమైన సూర్యరశ్మి అద్భుతంగా కలిగి ఉన్న దేశం మనది. సముద్ర తీర ప్రాంతాలలో ఉండేటువంటి హ్యూమిడిటీ వాతావరణ కావొచ్చు.. సముద్ర తీరం లేనటువంటి మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు, పంజాబ్, హిమాచల్, కశ్మీర్ లాంటి శీతల రాష్ట్రాలు కావొచ్చు.. మూడు డిఫరెంట్ ఆగ్రోటిక్ జోన్స్ దేశంలో ఉన్నాయి అని కేసీఆర్ అన్నారు.
భారత దేశంలో యాపిల్ పండుతుంది.. మామిడి కాయ కూడా పండుతుంది. ఇతర దేశాల్లో ఇలాంటి వాతావరణం ఉండదు. కష్టించి పనిచేసే దేశంలోని 130 కోట్ల జనాభాలో మనం తినేది మెక్డోనాల్డ్ పిజ్జాలు.. మెక్డోనాల్డ్ బర్గార్లా మనం తినేవి ? ప్రపంచానికే అద్భుతమైన ఫుడ్ చైన్ పెట్టి.. అద్భుతమైన పంటలు పండించి.. సాగు నీళ్లు పైకి తెచ్చి దానికి కనెక్టెడ్గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు పెట్టి.. అందులో కోటాను కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించి బెస్ట్ ఫుడ్ చైన్ ఆఫ్ వరల్డ్ గా ఉండాల్సినటువంటి.. భారత్ ఇవాళ కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుంటదా.. ఇంతకన్నా సిగ్గు చేటు ఇంకేమైనా ఉంటదా? లక్ష కోట్ల రూపాయల విలువైన ఫామాయిల్ను దిగుమతి చేసుకుంటదా.. ఇంతకన్న సిగ్గు చేటు ఉంటదా అని కేసీఆర్ అన్నారు.
75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కోట్లాది మందికి ఈరోజుకీ విషపు మంచినీళ్లా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఈ పాపం ఎవరిది అన్నారు. ” భారత దేశానికి ఒక లక్ష్యం ఉందా.. దేశం లక్ష్యం కోల్పోయింది.. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో వేసిన కొన్ని ప్రణాళికలు, కట్టిన కొన్ని ప్రాజెక్టులు తప్పా.. అతీ గతీ లేదు. మన రాష్ట్రంలోనే కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి 19 ఏండ్లు గడిచిపోయి 20 ఏండ్లలోకి అడుగుపెట్టినం. ఆ జడ్జి ముసలివాడు. నలుగురు తీసుకొచ్చి కూర్చొబెడతారు.
ఆయన ఎప్పుడు హరీ అంటడో ఎవరికీ తెలియదు. 20 ఏండ్లు దాటుతుంటే ట్రైబ్యునల్ ఉలుకూపలుకూ లేకుంటే తీర్పు వచ్చేదెప్పుడు. వాళ్ల మీదున్న గ్రీన్ ట్రైబ్యునల్ లాంటివి క్లియరెన్స్ ఇచ్చేది ఎప్పుడు. డిజైన్లు అయ్యేదెప్పుడు. నిధులు సమకూరేదెప్పుడు. ప్రాజెక్టులు కట్టేదెప్పుడు. ప్రజలకు సాగునీళ్లు, తాగు నీళ్లు వచ్చేదెప్పుడు. దీనికి ఏమైనా అమెరికాను అడుక్కోవన్నా. అంతర్జాతీయ రాజనీతి కావాల్నా. ప్రపంచబ్యాంకు వద్ద చిప్ప పట్టుకోవన్నా. ఏది అవసరం లేదు కదా.. ఇది నిజం కాదా.. మంచినీళ్లు ఇయ్య శాతకాదు.. కహానీలు చెప్పి కథలు చెప్పి.. ప్రజల్ని గోల్ మాల్ తిప్పుడు ఎందుకు. ఎక్కడ మనం మోసపుతున్నాం అని ప్రశ్నించారు.
ఖమ్మం సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి గల కారణాలను సీఎం కేసీఆర్ వివరించారు. జింబాంబ్వే అనే దేశంలో 6,533 టీఎంసీల రిజర్వాయర్ జాంబేజీ నది మీద ఉంది. రష్యాలో అంగారా నది మీద 5,968 టీంఎసీల ప్రాజెక్టు ఉంది. వోల్టా నది మీద ఘనా దేశంలో 5085 టీఎంసీల ప్రాజెక్టు, కెనడాలో మనీకూగాన్ నది మీద 4944 టీంఎసీల ప్రాజెక్టు , ఈజిప్టులో నైలు నది మీద 4500 టీఎంసీల ప్రాజెక్టు, చైనాలో యాంగ్జీ నది మీద 1400 టీఎంసీల ప్రాజెక్టు.. అమెరికాలోని కొలరాడో నది మీద 1200 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. మరి మన దేశానికి ఏమైంది. ? సువిశాల దేశం.. 139 కోట్ల జనాభా.. కరువులు చూసినం, కాటకాలు చూసినం.. వరదలు చూస్తున్నం.. ఇలాంటి ప్రాజెక్టు ఒక్కటి కూడా వద్దా మన మొఖానికి.. మనం నోసుకోలేదా.. ఇప్పటికీ మంచినీళ్లకు బాధపడాలా.. సరైన పరిపాలన వచ్చి.. నదుల నీళ్లు భూమ్మీదకు మళ్లి.. ప్రజల దాహం.. పొలాల దాహం తీర్చాల్నా, మనం సన్నాసులెక్క ఇట్లే ఉండాల్నా? దయచేసి దేశం ఆలోచించాలి అని సీఎం కేసీఆర్ అన్నారు.
ఖమ్మం సభ ద్వారా ఈ దేశాన్ని అడుగుతున్నట్లు పేర్కొన్నారు. ఇది ప్రశ్నించడానికి.. ఈ చైతన్యం తేవడానికి.. దీన్ని సాధించడానికి పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని ఖమ్మం వేదికగా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.