రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శనంగా నిలుస్తున్నాయని రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గంలో 200 కోట్లకు పైగా పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తో కలసి కెటిఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ముందుగా ఉదయం 11.30 నిమిషాలకు హెలిప్యాడ్ నుండి ప్రారంభమై హుజూర్ నగర్ మార్కెట్ యార్డ్ లో ఈ హెచ్ ఎస్ డిస్పెన్సరీ ధవాఖానను ప్రారంభించి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంత కార్మికులకు మంచి వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులు,సిబ్బందికి పలు సూచనలు చేశారు.తదుపరి తహసీల్దార్ కార్యాలయం పరిధిలో గల నూతన ఎస్టీఓ కార్యాలయాన్ని ప్రారంభించారు.అనంతరం రామస్వామి గట్టు లోగల సింగిల్ బెడ్ రూమ్ భవనాల సముదాయాన్ని మంత్రులు పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేసేవిదంగా సిద్ధం చేయాలని,మిగిలిన పనులకు ప్రభుత్వం రూ 30 కోట్లు కేటాయించిందని, ఆర్.అండ్ బి అధికారులు త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం కోటి రూపాయలతో నిర్మించిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంతో పాటు 20 కోట్ల రూపాయలతో చేపట్టనున్న కేతవారిగూడెం,వెలదండ,మునగాల రహదారి విస్తరణ పనులు,6 కోట్ల రూపాయలతో నిర్మించనున్న హుజూర్ నగర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు,10 కోట్ల రూపాయలతో నేరేడుచర్ల మున్సిపాలిటి పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులకు,మగ్దుమ్ నగర్,మాధవ రాయిని గూడెం బస్తి దవాఖానాలకు,26 లక్షల రూపాయలు,2 కోట్ల రూపాయలతో గరిడేపల్లి వద్ద ఎన్ ఎస్ పి ఎడమ కాలువ వంతెన నిర్మాణ పనులకు,నీటి పారుదల ఆయకట్టు నిర్మాణానికి కొరకు 1.37 లక్షలు,50 లక్షలతో ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ వంతెన నిర్మాణానికి,18 లక్షలతో రామాపురం,వేపల సింగారం వంతెన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమాల అనంతరం తిరుగు ప్రయాణంలో హెలిప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్, ఎస్పీ ని మంత్రి అభినందించారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,హుజూర్ నగర్ శాసన సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి,తుంగతుర్తి శాసనసభ్యుడు గాదరి కిషోర్ కుమార్,కోదాడ శాసనసభ్యుడు బొల్లం మల్లయ్య యాదవ్,నకిరేకల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య, మిర్యాలగూడెం శాసనసభ్యుడు భాస్కర రావు,జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్,అదనపు కలెక్టర్ యస్.మోహన్ రావు,ఆర్.డిఓ వెంకారెడ్డి,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్