‘ఇంటింటా మువ్వెన్నెల జెండా’ ఉత్సవాలలో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, తెలంగాణ విభాగం హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో తెలుగు స్వాతంత్య్ర సమర యోధుల ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటుచేసింది. ఈ ఛాయాచిత్ర ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర గవర్నరు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. ఈ ఛాయా చిత్ర ప్రదర్శనలో ఇంటింటా మువ్వెన్నెల జెండాతోపాటు తెలుగు స్వాతంత్య్ర సమరయోధులు, ముఖ్యంగా అజ్జ్ఞాత స్వాతంత్య్ర వీరుల గురించి పరిచయం చేశారు.
ఈ ఛాయా చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లడుతూ 75 సంవత్సరాల స్వాతంత్ర్య అమృత మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మన దేశభక్తికి ప్రతీకగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని తెలంగాణ ప్రజలకు గవర్నర్ పిలుపునిచ్చారు.
75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను మనం ఎంతో గర్వంగా, గౌరవంగా, ఆనందంగా జరుపుకోవాలని, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం మనది, అందుకు గర్వపడాలని గవర్నర్ అన్నారు. స్వాతంత్య్ర పోరాటాన్ని, తెలుగు స్వాతంత్య్ర సమరయోధులు, ముఖ్యంగా అజ్జ్ఞాత స్వాతంత్య్ర వీరులను స్మరించుకోవడం ఈ సమయం లో అవసరమని, యువత చదువుతో పాటు దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన యోధుల చరిత్ర గురించి కూడా తెలుసుకోవడం అవసరమని , ఈ చాయాచిత్ర ప్రదర్శనను సందర్శించి, ప్రేరణ పొందాలని, మన స్వాతంత్ర్య పోరాటం గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని ఆమె అన్నారు. దాదాపు 40 పానెళ్లతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసిన కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ను ఈ సందర్భంగా గవర్నర్ అభినంధించారు.
ఇంటింటా మువ్వెన్నల జెండా (హర్ ఘర్ తిరంగా ) ఉద్యమాన్ని బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు విజ్జప్తి చేశారు. “ఈ ఏడాది స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో ఇంటింటా మువ్వెన్నల జెండా ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ మీ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలి. ఈ ఉద్యమం జాతీయపతాకంతో మన అనుబంధాన్ని మరింత బోలపేతం చేస్తుంది”. అని గవర్నర్ అన్నారు.
75 ఏళ్ల స్వతంత్ర భారత దేశ మహోజ్వల ఘట్టం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవ తీసుకొని 2021 మార్చి 12న స్వాతంత్య్ర అమృత మహోత్సవం(ఆజాదీ కా అమృత్ మహోత్సవ్) ప్రారంభించారు. అమృత మహోత్సవం ఆరంభం నుంచి భారతదేశ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. దేశ ప్రజలంతా త్రివర్ణ పతాకాన్ని ఇంటికి తెచ్చుకొని దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన తమ ఇంటిపై ఎగరేసేలా ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఇంటింటా మువ్వెన్నల జెండా కార్యక్రమాన్ని ప్రకటించారు.
“75 ఏళ్ల స్వాతంత్య్ర సందర్భంగా జాతి మొత్తం సమిష్టిగా త్రివర్ణ పతాకాన్ని తమ ఇంటికి తెచ్చుకోవడం అంటే త్రివర్ణ పతాకంతో వ్యక్తిగత అనుబంధానికి చిహ్నంగానే కాకుండా జాతి నిర్మాణం పట్ల మన నిబద్ధతకు ప్రతిరూపంగా నిలుస్తుంది.” పౌరులంతా తమ ఇళ్ల నుంచి త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని, సామాజిక మాధ్యమాలలో తమ ప్రదర్శన చిత్రం( ప్రొఫైల్ పిక్) గా తిరంగా చిత్రంగా మార్చాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన 91వ మన్ కీ బాత్ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి రోజు ఆగస్టు 2న ఈ ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది.
ఎస్. వెంకటేశ్వర్ డైరెక్టర్ జనరల్ (సౌత్ జోన్), రంజనా దేవ్ శర్మ అదనపు డైరెక్టర్ జనరల్ (సిబిసి – న్యూఢిల్లీ), డా. ఎ. నాగేందర్ రెడ్డి, డైరెక్టర్, సాలార్ జంగ్ మ్యూజియం, శృతి పాటిల్. డైరెక్టర్, పిఐబి & సిబిసి, డాక్టర్ మానస్ కృష్ణకాంత్, డిప్యూటీ.డైరెక్టర్, పిఐబి, ఐ. హరిబాబు, అసిస్టెంట్ డైరెక్టర్, సిబిసి, ఇతర ఉన్నతాధికారులు పత్రికా సమాచార కార్యాలయం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అధికారులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.