సంగారెడ్డి జిల్లా కందిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ చేయడం అంటే కేవలం పాఠశాల భవనాన్ని పరిశీలించి రావడం కాకుండా అక్కడి విద్యార్ధులతో మాట్లాడారు. వారి చదువు గురించి వాకబు చేశారు.
అందులో నిర్ఘాంత పోయే విషయాలు వెల్లడయ్యాయి. పదోతరగతి విద్యార్థుల తో మంత్రి హరీష్ రావు మాట్లాడితే మంత్రి వేసిన ప్రశ్నలకు విద్యార్ధులు తెల్లమొహం వేశారు. ఆయా సబ్జెక్టు లలో విద్యార్ధుల్ని మంత్రి ప్రశ్నలు వేశారు. తెలుగులో సరిగా పేర్లు కూడా రాయలేకపోవడంతో మంత్రి హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు.
విద్యార్థుల చదువు ఇలా ఉంటే ఎలా పాసవుతారని టీచర్లను మంత్రి ప్రశ్నించారు. పదో తరగతి చదువుతున్నా కనీసం ఎక్కాలు వారు చెప్పలేకపోయారు. విద్యార్ధులు ఇలా ఉంటే ఈ చదువులతో ప్రపంచంతో ఎలా పోటీపడతారని మంత్రి ప్రశ్నించారు.
అనంతరం కందిలో నిర్మిస్తున్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆర్థిక మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మంత్రి హరీష్ రావు సూచించారు.