ప్రేమ పేరుతో ఓ యువకుడు యువతిని వేదింపులకు గురిచేసాడు. చెప్పినట్లు వినకపోతే తనతో దిగిన ఫోటోలను, చాటింగ్ లను సోషల్ మీడియా లో పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో భయబ్రాంతులకు గురైన యువతి దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా నింద్ర మండలంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….
నింద్ర మండలంలో నివాసముండే అశోక్, శైలజ లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అశోక్ ప్రవర్తన బాగా లేకపోవడం వలన యువతి అతని దూరం పెడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో తనతో సన్నిహితంగా ఉన్న ఫోటో లను, వాట్సప్ చాటింగ్ లను యువతికి పంపించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.
తాను చెప్పినట్లు వినకపోతే ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తానని వేధింపులకు గురిచేసాడు. భయాందోళనకు గురైన యువతి దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది.
దిశ SOS కు కాల్ చేసిన యువతిని పుత్తూరులోని ఓ దేవాలయం వద్ద ఉన్నట్లు లొకేషన్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. కేవలం పది నిముషాల వ్యవధిలో దిశ టీం బాధితురాలిని కలిసి ధైర్యం కల్పించింది.
మహిళా పోలీస్ ఆధ్వర్యంలో పుత్తూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన యువతి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. బాధిత యువతి ఇచ్చే ఫిర్యాదు మేరకు అశోక్ పై చర్యలు తీసుకుంటామని పుత్తూరు పోలీసులు పేర్కొన్నారు.