రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కొనసాగమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టు నేరుగా ఎక్కడా చెప్పలేదని ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం తనంతట తానే బాధ్యతలు స్వీకరించినట్లుగా సర్క్యూలర్ విడుదల చేశారని ఇది చెల్లదని ఆయన అన్నారు.
ఇంకా శ్రీరామ్ ఏమన్నారంటే: నిన్న మధ్యాహ్నం 3.30 గంటలకు హైకోర్టు జడ్జిమెంట్ కాపీ వచ్చింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర, జిల్లా అధికారులకు ఒక సర్కులర్ జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారిగా తిరిగి బాధ్యతలు చేపట్టినట్లుగా నిమ్మగడ్డ రమేష్ కుమారే ప్రకటించుకున్నారు.
విజయవాడ కార్యాలయం నుంచి సర్క్యూలర్ విడుదల చేసి హైదరాబాద్లోని తన ఇంటికి వాహనాలు పంపించాలన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ వేశాం. అప్పటివరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కూడా కోరాం.
రాష్ట్ర ఎన్నికల అధికారిని నియమించే అధికారం రాష్ట్రానికి లేదు అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా ఈ నిబంధనే వర్తిస్తుంది. అలాంటప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రభుత్వం ఎలా నియమిస్తుంది? నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కూడా అప్పటి సీఎం చంద్రబాబు సలహా మేరకే నియమించారు. గవర్నర్ నిర్ణయంలో మంత్రి మండలి సలహా అవసరం లేదంటే.. అప్పటి సీఎం చంద్రబాబు ఇచ్చిన సలహా కూడా చెల్లదు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం కూడా చెల్లదు. హైకోర్టు తీర్పులో కాలవ్యవధి స్పష్టంగా చెప్పకుంటే రెండు నెలల కాలవ్యవధి ఉంటుంది. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వీయ నియామకం చేసుకునే అధికారం లేదు. ఎస్ఈసీ స్టాండింగ్ కౌన్సిల్ గా ఉన్న ప్రభాకర్ ను రేపటిలోగా రాజీనామా చేయమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.
ఈ విషయం ప్రభాకర్ నాకు ఫోన్ చేసి చెప్పారు. నాకు కొంత సమయం కావాలని ప్రభాకర్ నిమ్మగడ్డను కోరారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం రేపటిలోగా రాజీనామా చేయమని ఆదేశించారు. ఎస్ఈసీ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం కూడా చట్ట విరుద్ధం.
హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వీయ నియామకం చేసుకునే అధికారం లేదు. సాధారణంగా ప్రభుత్వ న్యాయనిపుణులు ఎప్పుడూ మీడియా ముందుకు రారు.. కానీ ఇది రాజ్యాంగ అంశాలు హైకోర్టు తీర్పుతో కూడినందున మీడియా ముందుకు రావాల్సివచ్చింది.