సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ కావడం రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖకు మాయని మచ్చ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. వివేకా హత్య కేసును హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో అచ్చెన్న స్పందించారు. తనలో ఏమాత్రం నైతికత మిగిలి ఉన్నా జగన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసు తెలంగాణకు బదిలీ చేయడంపై జగన్ ఏం సమాధానం చెబుతారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేశారంటూ సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు, తాడేపల్లి ప్యాలెస్ ప్రమేయాన్ని బహిర్గతం చేసినట్లు అయిందని ఎద్దేవా చేశారు. జగన్ బ్యాచ్ పథకం ప్రకారమే గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చారని ఈ విషయం సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో తేటతెల్లమైందన్నారు.
previous post