వేములవాడ పట్టణ, దేవాలయాభివృద్దికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఐటి మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వస్తున్న లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్, వేములవాడ మునిసిపల్ చైర్మన్ రామతీర్ధపు మాధవి, వైస్ చైర్మన్ మధు రాజేందర్ శర్మ, సెస్స్ డైరెక్టర్ రామతీర్ధపు రాజు నేడు హైదరాబాద్ ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారినుద్దేశించి మాట్లాడారు. మేడారం జాతరకు వేములవాడ వచ్చి వెళ్లడం సాంప్రదాయంగా వస్తున్నదని అందువల్ల వెంటనే యుద్ధ ప్రాతిపదికపైన మెరుగైన సేవలు అందించాలని కమీషనరును మంత్రి ఆదేశించారు.
శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 20, 21 తేదీలలో కోటి రూపాయలతో అద్భుతమైన శివార్చన నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారు. వేములవాడ మున్సిపాలిటీలో సుపరిపాలనకు నడుంకట్టాలని చైర్మన్, వైస్ చైర్మన్లకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక సూచనలు చేశారు. వీటీడీఏతో కలిసి అభివృద్ధిలో పాలు పంచుకోవాలని తాను, శాసనసభ్యుడు చెన్నమనేనితో కలిసి స్వయంగా త్వరలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.